వస్తు, సేవల పన్ను నెట్వర్క్ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. జీఎస్టీలో చోటు చేసుకుంటోన్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై జీఎస్టీలో అవకతవకలకు గానీ, అక్రమాలకు గానీ పాల్పడితే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు చర్యలు తీసుకుంటారు.
వారిపై పీఎంఎల్ఏలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. అంతేకాకుండా జీఎస్టీ నెట్వర్క్లో ఉన్న సమాచారం మొత్తాన్ని కూడా పీఎంఎల్ఏ కింద అధికారులు పరస్పరం పంచుకోవచ్చు. ఈ నెట్వర్క్లో ఉన్న వారిపై పీఎంఎల్ఏ కింద నిఘా ఉంచడానికీ వెసలుబాటు లభించినట్టయింది. నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లు, నకిలీ ఇన్వాయిస్లు తీసుకోవడం వంటి జీఎస్టీ నెట్వర్క్ పరిధిలోని ఆర్థిక నేరాలను ఇకపై అత్యంత తీవ్రమైనవిగా భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిని మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి తీసుకు వచ్చినట్టయింది. మనీలాండరింగ్ కింద అక్రమాలకు పాల్పడిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చర్యలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా చర్యలకు దిగుతుంది.
ఈడీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఇకపై జీఎస్టీ నెట్వర్క్ పరిధిలో ఉన్న పూర్తి సమాచారాన్ని పంచుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ జాబితాలో ఇప్పటివరకు 25 సంస్థలు ఉన్నాయి. జీఎస్టీ నెట్వర్క్ 26వది. దీన్ని పీఎంఎల్ఏ పరిధిలోకి చేర్చడానికి చట్టంలోని సెక్షన్ 66కు మార్పులను ప్రభుత్వం నోటిఫై చేసింది.
నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ కేసులపై ఈడీ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. కొంతమంది వ్యాపారులు జీఎస్టీ రిజిస్ట్రేషన్ను పొందడానికి నకిలీ పాన్-ఆధార్ కార్డులను వినియోగిస్తోన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. మనీలాండరింగ్ కోసం డొల్ల కంపెనీల ఏర్పాటు చేసినట్లు గుర్తించింది.
More Stories
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం
వచ్చేనెల పిఎం కిసాన్ నిధులు విడుదల
ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జిషీట్లో ఆప్ పేరు