
ఆసియా ఫెన్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు తొలి కాంస్యం సాధించడం ద్వారా భారత స్టార్ మహిళా ఫెన్సర్, ఒలింపియన్ సీఏ భవానీ దేవి చరిత్ర సృష్టించింది. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో సోమవారం చైనాలోని వుక్సీలో జరిగిన మహిళల సెబర్ సెమీఫైనల్లో కాంస్య పతకం సాధించి ఈ రికార్డు నెలకొల్పింది.
ఉజ్బెకిస్తాన్కు చెందిన జైనబ్ దయిబెకోవా చేతిలో 14-15తో భవానీ ఓడింది. అయితే, ప్రతిష్టాత్మక ఈవెంట్లో భారత్కు తొలి పతకాన్ని సాధించిపెట్టింది. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్లో ప్రస్తుత చాంపియన్ జపాన్కు చెందిన మిసాకి ఎమురాపై 15-10తో నెగ్గింది.
కైరోలో జరిగిన 2022 ప్రపంచ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో మిసాకి మహిళల సెబర్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. గతంలో జపాన్తో ఆడిన అన్ని మ్యాచ్లలో ఓడిన భవానీకి మిసాకిపై ఇది తొలి విజయం. 29 ఏళ్ల భవాని కజకిస్థాన్కు చెందిన దోస్పే కరీనాను ఓడించడానికి ముందు 64 రౌండ్లో బై పొందింది.
ఆ తర్వాత భవాని ప్రీక్వార్టర్స్లో మూడో సీడ్ ఒజాకి సెరీని 15-11తో చిత్తు చేసింది. క్వార్టర్ఫైనల్లో భవానీ దేవి 15-10పాయింట్ల తేడాతో ప్రపంచ ఛాంపియన్కు షాక్ ఇచ్చింది. అంతకుముందు మిసాకితో జరిగిన మూడు మ్యాచుల్లోనూ ఓడిన భవానీ ఈ మ్యాచ్లో ప్రారంభం నుంచే అద్భుత ప్రదర్శను ఆకట్టుకుంది.
విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యున్నత క్రీడాకారిణులను ఓడించాలన్నది తన కల అని, టాప్ క్లాస్ ప్లేయర్ మిసాకిపై విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అలాగే చరిత్రలో తొలిసారి ఫెన్సింగ్ విభాగంలో భారత్కు పతకం సాధించినందుకు గర్వంగా ఉన్నట్లు తెలిపింది. గత ఆసియా క్రీడల్లో మిసాకి చేతిలో ప్రి క్వార్టర్స్లో ఓడానని, ఈసారి ఓ ప్రణాళిక ప్రకారం ఆమెపై విజయం సాధించానని వెల్లడించింది.
చారిత్రక విజయాన్ని సాధించిన భవానీని ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అభినందించారు. భారత ఫెన్సింగ్కు ఇది చాలా గర్వకారణమైన రోజు. ఇంతకు ముందు ఎవరికీ సాధ్యం కానిది భవానీ సాధించిందని కొనియాడారు. ప్రతిష్టాత్మకమైన ఆసియా చాంపియన్షిప్లో పతకం సాధించిన తొలి భారత ఫెన్సర్గా నిలిచింది అని మెహతా మీడియాతో చెప్పారు. ఆమె సెమీఫైనల్లో కేవలం ఒకే పాయింట్ తేడాతో ఓడింది. కాబట్టి ఒక రకంగా ఆమెకిది గొప్పవిజయమే అని పేర్కొన్నారు.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు
కంగనా రనౌత్కు సుప్రీంకోర్టు చీవాట్లు