
తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. ఆ వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరుతూ బిజెపిలోనే తాను కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల కోసం దుష్ప్రచారాలతో బిజెపిని బలహీనం చేసే కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
“కర్ణాటక ఫలితాలు చూసి కాంగ్రెస్లోకి మళ్లీ రావాలని నా మిత్రులు అడుగుతున్నారు. నేను బిజెపిని వీడుతున్నట్లు కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి” అని తెలిపారు. కాగా, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి కోట్లు రూపాయలు సంపాదించారని, 20 ఏళ్లు టిడిపిలో ఉండి కాంగ్రెస్లోకి వచ్చారని ధ్వజమెత్తారు.
తాము ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్లోనే ఉన్నవాళ్లం అంటూ ఈ మధ్యే వచ్చిన రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేయాలి? అని ప్రశ్నించారు. “నేను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. పోరాడే వ్యక్తిని. దుష్ప్రచారంతోనే మునుగోడు ఉప ఎన్నికలో నన్ను ఓడించారు” అని తేల్చి చెప్పారు.
కెసిఆర్ను గద్దె దింపేందుకే బిజెపిలోకి వచ్చానని గుర్తు చేస్తూ కర్ణాటక, తెలంగాణలో ఒకే తరహా పరిస్థితులు లేవని ఆయన తెలిపారు. అసలు ఎన్నికల్లో గెలవకముందే రాష్ట్ర కాంగ్రెస్లో విభేదాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. తాను జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని అంటూ డబ్బు, అధికారం కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు.
“కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకే దుష్ప్రచారం చేసి నన్ను ఓడించారు. పారదర్శకంగా నా కంపెనీకి టెండర్ వచ్చింది. అప్పులపాలైన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం మోదీ. అమిత్ షా నాయకత్వంలోని బిజెపికే సాధ్యమనే నమ్మకంతో పార్టీలో చేరా” అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ను ఓడించే శక్తి బిజెపికే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని చెబుతూ మీడియా చేసే దుష్ప్రచారాలకు భయపడే వ్యక్తిని తాను కాదని చెప్పారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను మార్చాలని ఎవరూ లాబీయింగ్ చేయడం లేదని అంటూ ఎన్నికల సంవత్సరం కాబట్టి బిజెపిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా పార్టీని బలహీనం చేసే కుట్ర తప్ప మరేమీ లేదని అంటూ కొట్టిపారేసారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు