
హిందూ దేవి దేవతలను దూషించిన రేంజర్ల రాజేష్ వెంటనే రిమాండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. సరస్వతీ మాత గురించి అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. వెంటనే రెంజర్ల రాజేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్ చేయాలని పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.
గురువారం రాత్రి తెలంగాణ డిజిపి అంజని కుమార్ ను కలిసిన పరిషత్ నేతలు రేంజర్ల రాజేష్, బైరి నరేష్ లపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని, పోలీసులు కూడా నిందితులకి వత్తాసు పలుకుతున్నారని డీజీపీకి వివరించారు. కల్వకుర్తిలో హిందూ యువకులను ముస్లింలుగా మతం మారుస్తున్నారని, మహబూబాబాద్ మానుకోట లో ఎస్పీ ఎదుటనే హిందువులపై దాడులు చేస్తున్నారని కూడా తెలిపారు.
వెంటనే హిందూ ద్రోహులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్ , సహ కార్యదర్శి భాను ప్రసాద్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు డీజీపీ కార్యాలయంలో అంజనీ కుమార్ ను కలిసి హిందువులపై జరుగుతున్న దాడులను వివరించారు. నాస్తికత్వం పేరుతో హిందుత్వంపై దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నాస్తిక ముసుగు తొడిగిన వారు దేశద్రోహానికి పాల్పడుతున్నారని, వారిపై నిఘా పెంచాలని పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన డీజీపీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి