పెట్రోలు డీజిల్లను జిఎస్టి పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అయితే రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అని పెట్రోలియం , సహజవనరుల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశ్నించారు. కేంద్రం ఈ ప్రతిపాదన చేసినా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఉంటుందనే తాము భావిస్తున్నామని , రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఇంధనం జిఎస్టి పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఇప్పుడే కాదు చాలా కాలం నుంచే కేంద్రం ఈ విషయంపై సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆయన వివరించారు. అయితే జిఎస్టి పరిధిలోకి డీజిల్, పెట్రోలు ధరలను తీసుకువస్తే తలెత్తే పరిణామాలు దీనిని అమలు చేయడం అనేది మరో విషయం అని, సంబంధిత ఆర్థిక లావాదేవీల విషయం గురించి చెప్పాల్సింది తాను కాదని, ఆర్థిక మంత్రి అని తెలిపారు.
ఈ ప్రశ్న ఆర్ధిక మంత్రినే అడగాల్సి ఉంటుందని ఇంధన మంత్రి తెలిపారు. ఆదాయం వచ్చే వాటిని రాష్ట్రాలు ఎందుకు వదులుకుంటాయని ప్రశ్నించారు. లిక్కర్, ఇంధనం విక్రయాల నుంచి రాష్ట్రాలకు మంచి ఆదాయం వస్తోందనేది విదితమే. దీనిని వారు వదులుకోరని, ఏది ఏమైనా ద్రవ్బోల్బణం, ఇతర ఆర్థిక చిక్కుల గురించి ఆందోళన చెందేది కేవలం కేంద్రమే అని పేర్కొంటూ రాష్ట్రాలపై కేంద్ర మంత్రి చురకలకు దిగారు.
దేశంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయనే వాదనను మంత్రి ఖండించారు. అమెరికా వంటి దేశంలోనే ఒక్క ఏడాదే ఇంధన ధరలు 43 శాతం పెరిగాయని, భారత్ లో కేవలం రెండు శాతం పెరిగాయని తెలిపారు. పొరుగు దేశాలలో ఇంధన సంక్షోభం పలు చిక్కులను తెచ్చిపెడుతున్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగినా, యుద్ధాలు సరఫరాల నిలిపివేతలు ఆటంకాల వంటి సమస్యలు తలెత్తినా ఇంధన ధరలు పెరగకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. ఎక్సైజ్ సుంకాలను తగ్గించుకుంటూ పరిస్థితిని బేరీజు వేసుకుంటూ వ్యవహరించడం వల్లనే దేశంలో ఇంధన ధరలు నియంత్రణలో ఉన్నాయని ఇంధన మంత్రి తెలిపారు.
More Stories
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై 9న తీర్పు
ఝార్ఖండ్ మంత్రి సహాయకుడి ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు
ఎమ్మెల్సీ కవితకు మళ్లీ బెయిల్ నిరాకరణ