రాజాసింగ్ కు తోటి ఖైదీల నుండి ప్రాణ హాని.. హైకోర్టుకు భార్య

రాజాసింగ్ కు తోటి ఖైదీల నుండి ప్రాణ హాని.. హైకోర్టుకు భార్య
గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ త‌ర‌పున ఆయ‌న భార్య ఉషాబాయి మ‌రోసారి హైకోర్టుని ఆశ్ర‌యించారు.తెలంగాణ పోలీసులు రాజా సింగ్ పై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఆమె ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
 
తాజాగా తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో తోటి ఖైదీల నుంచి తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ నేపథ్యంలో తన భర్తకు ప్రత్యేక వసతులకు అవకాశం కల్పించాలని ఆమె తన పిటిషన్ లో హైకోర్టును కోరారు. జైలులో ఇతర ఖైదీలకు దూరంగా తన భర్తకు ఓ గదిని కేటాయించాలని ఉషాబాయి హైకోర్టును కోరారు.
 
ప్రత్యేక గదితో పాటు అందులో మంచం, టేబుల్, కుర్చీ, వార్తా పత్రికలు, టీవీ, వంట చేసుకోవడానికి తగిన వసతులు కల్పించాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. తమ వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.