శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా దేశ అధ్యక్షుడు, ప్రధానిపై విపక్షనేతలు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఇటు కొలంబోలో నిరసనలు మిన్నంటాయి. ఆందోళనకారుల దాడిలో అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు చనిపోయారు.
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక దేశంలో పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నాయకుల రాజీనామాల డిమాండ్ పెరిగింది.
ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ నుంచి అధ్యక్ష కార్యాలయం వెలుపల ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులపై రాజపక్స విధేయులు కర్రలతో దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాజపక్సే మద్దతుదారులు నిరసనకారులను కర్రలతో చితకబాదారు. అటు పోలీసులు కూడా నిరసనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించారు.
నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు, సామాగ్రి, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు.దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అత్తుకోరల నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు ఎంపీ అమరకీర్తి అత్తుకోరల కారును అడ్డుగించారు. ఆయనపై దాడి చేయడంతో అమరకీర్తి మృతి చెందినట్టు శ్రీలంక మీడియా వెల్లడించింది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో కొలంబోలో కర్ఫ్యూ విధించారు.
More Stories
30 ఏళ్ళ తర్వాత కేన్స్ లో భారతీయ చిత్రం సందడి
బ్రిటన్ పార్లమెంట్ కు జులై 4న ముందస్తు ఎన్నికలు
భారత సంతతి శాస్త్రవేత్త కులకర్ణికి ప్రతిష్ఠాత్మక షా ప్రైజ్