వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్ లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా రూ. 1.31,526 కోట్లను ప్రభుత్వం సేకరింపగలిగింది. ఇది కిందటేడాది నవంబర్లో వచ్చిన రూ. 1.05 లక్షల కోట్లు కంటే 25 శాతం ఎక్కువ. మొత్తంగా జీఎస్టీ చరిత్రలోనే రెండోసారి అత్యధికం. ఈ ఏడాది అక్టోబర్లో కూడా ప్రభుత్వానికి రూ. 1.30 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది.
ఈ ఏడాది ఏప్రిల్లో ఎన్నడూ లేనంతగా రూ. 1.41 లక్షల కోట్లను ప్రభుత్వం జీఎస్టీ కింద సేకరించగలిగింది. నవంబర్ జీఎస్టీ వసూళ్ళలో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) వాటా రూ. 23,978 కోట్లు. స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) వాటా రూ. 31,127 కోట్లు కాగా, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) వాటా రూ. 66,815 కోట్లు (ఇందులో దిగుమతులపై వేసిన రూ. 32,165 కోట్ల ట్యాక్స్ కలిసుంది).
సెస్ కింద రూ. 9,606 కోట్ల రెవెన్యూ రాగా, ఇందులో రూ. 653 కోట్లు దిగుమతులపై వేసిన సెస్ వలన వచ్చాయి. కాగా, రూ. 1.30 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లను దాటడం వరసగా ఇది రెండో నెల. కరోనా మహమ్మారి అనంతరం వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థాయికి వస్తుండడంతో ఆర్ధిక వ్యవస్థ తిరిగి కోలుకొంటున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
వరసగా ఐదో నెలలో కూడా జీఎస్టీ రెవెన్యూ రూ. 1 లక్ష కోట్లను దాటిందని గుర్తు చేస్తున్నారు. “నవంబర్లో వచ్చిన జీఎస్టీ రెవెన్యూ మొత్తం జీఎస్టీ చరిత్రలోనే రెండవ అత్యధికం. ఈ ఏడాది ఏప్రిల్లో వచ్చిన జీఎస్టీ రెవెన్యూ మొదటి స్థానంలో ఉంది” అని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
జీఎస్టీ వసూళ్లు పెరుగుతూ ఉండడానికి కారణం ప్రభుత్వం తెస్తున్న విధానాలే అని అభిప్రాయపడింది. కాగా, ఎక్సైజ్ డ్యూటి, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటి వివిధ రకాల పన్నులను తొలగించి వీటి స్థానంలో జీఎస్టీని ప్రభుత్వం తెచ్చింది. 2017 జులై 1 నుంచి ఈ పన్ను విధానం అమలవుతోంది.
గడువు ముగిసినా జీఎస్టీ రిటర్న్లను దాఖలు చేయని వారిపై ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది. వారి ఈ–వే బిల్లులను ఆపేయడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను అందించకపోవడం వంటివి చేస్తోంది. దీంతో జీఎస్టీ రిటర్న్లను దాఖలు చేసేవారు పెరుగుతున్నారని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2021–22 లో సెంట్రల్ జీఎస్టీ రూ. 5.8 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది బడ్జెట్ అంచనాల కంటే రూ. 50 వేల కోట్లు ఎక్కువ కాగలదు. చాలా రాష్ట్రాలలో జీఎస్టీ వసూళ్లు 18–30 శాతం మేర పెరిగాయని, బిదీనికి తోడు దిగుమతుల నుంచి వచ్చిన పన్నులు కూడా పెరిగాయని విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలు సహితం కోలుకొంటున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరో కరోనా వేవ్ లేకపోతే, రానున్న నెలల్లో కూడా జీఎస్టీ వసూళ్లు మరింతగా పెరగగలవని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకురాలేమని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిలే తీసుకుందని గుర్తు చేశారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తెస్తే రెవెన్యూ తగ్గిపోతుంది. అందుకే 45వ జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
More Stories
తెలుగు భాషను బతికించుకోవాలి
కాంగ్రెస్ పార్టీకి రూ.1823 కోట్ల ఐటీ నోటీసు
రేవంత్ పక్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు