జమ్మూలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

జమ్మూలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది.  రూ.33.52 కోట్ల వ్యయంతో 18 నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తి కానుంది.

మజీన్‌ ప్రాంతంలోని జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి వెంట ఆలయ నిర్మాణ ప్రదేశంలో కేంద్ర మంత్రులు జితేంద్రసింగ్‌, కిషన్‌ రెడ్డితోపాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా భూమిపూజ చేశారు. 

టీటీడీలోని 28 మంది బోర్డు సభ్యులతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు శాసనసభ్యులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, 12 మంది ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగిందని అధికారులు తెలిపారు. ఈవో జవహర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రాంమాధవ్‌  కూడా పాల్గొన్నారు

ఆలయ నిర్మాణానికి కేటాయించిన 62 ఎకరాల్లో తొలివిడుత రూ 33 కోట్లతో 17 ఎకరాల్లో ఆలయ కాంప్లెక్స్‌తోపాటు సరిహద్దు గోడ, వేద పాఠశాల, సిబ్బంది క్వార్టర్స్‌, భక్తుల వసతి నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఏడాదికి కనాల్కు రూ.10 అద్దె చొప్పున 40 ఏళ్లపాటు కశ్మీర్‌ ప్రభుత్వం మొత్తం భూమిని టీటీడీకి లీజ్‌కు ఇచ్చింది. అద్దె కింద రూ. లక్షా 98 వేలు జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి చెల్లించి భూమిని టీటీడీ తన ఆధీనంలోకి తీసుకుంది.