* ప్రభుత్వంకు స్వదేశీ జాగరణ్ మంచ్ విజ్ఞప్తి
రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (ఎండిఆర్) విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం) కోరింది. దీనికి అయ్యే ఖర్చుల దృష్ట్యా ఇటువంటి చర్య అవసరం లేదని స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుండి వ్యాపారులకు చేసే రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపై 0.4 శాతం రుసుమును ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాలని బ్యాంకులు ఎప్పుడూ డిమాండ్ చేయలేదని ఎస్ జె ఎం సహ-కన్వీనర్ అశ్వని మహాజన్ స్పష్టం చేశారు. వాస్తవానికి, ఏటీఎంల వంటి భౌతిక మౌలిక సదుపాయాల అవసరాన్ని తగ్గించడం ద్వారా ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ బ్యాంకుల లావాదేవీల ఖర్చులను తగ్గించిందని ఆయన తెలిపారు.
“ఏ బ్యాంకూ యూపీఐపై ఎండీఆర్ విధించాలని కోరలేదు. వాస్తవానికి, యూపీఐ బ్యాంకుల లావాదేవీల ఖర్చులను తగ్గించింది. అవసరం లేకపోవడం వల్ల చాలా ఏటీఎంలు మూతపడ్డాయి. కాబట్టి ‘జీరో- ఎండీఆర్‘ విధానం పట్ల బ్యాంకులు సంతోషంగా ఉండాలి,” అని మహాజన్ తెలిపారు. సైబర్ భద్రత, ఇతర అంశాలకు సంబంధించిన ఖర్చులను యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడానికి సమర్థనగా చూపలేమని ఆయన పేర్కొన్నారు.
యూపీఐకి సంబంధించిన ‘జీరో- ఎండీఆర్‘ విధానంపై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యుఎస్ టిఆర్) వ్యక్తం చేసిన ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుత విధానాన్ని మార్చకూడదని చెప్పడానికి ఇది మరింత బలమైన కారణమని మహాజన్ పేర్కొన్నారు. ఎందుకంటే, వీసా, మాస్టర్కార్డ్ వంటి అమెరికన్ కార్డ్ కంపెనీలు యూపీఐ కారణంగా భారీగా నష్టపోయాయని, అలాగే ఈ కంపెనీలకు చెల్లించే విదేశీ మారకద్రవ్యం భారీగా ఆదా అవుతోందన్న వాస్తవమే ఆ ఆందోళనకు అసలు కారణం అని తెలిపారు.
“అలాంటి నివేదికలలో వ్యక్తపరిచిన ఒత్తిడి లేదా ఆందోళనల కారణంగా దీనిని చేయకూడదు. ఇటువంటి నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి,” అని ఆయన సూచించారు. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ను ప్రవేశపెట్టే చర్యను సమర్థించుకోవడానికి ఇందులో ఉన్న మొత్తం అంత గణనీయమైనది కాదని ఆయన పేర్కొన్నారు.
“ఎండీఆర్ ను విధించడానికి ఇంత ఆత్రుత పడాల్సినంత పెద్ద మొత్తం ఇందులో లేదు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉంది,” అని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, ఎక్స్ లో ఒక పోస్ట్లో మహాజన్ ఈ చర్యను “అత్యంత దురదృష్టకరం” అని అభివర్ణించారు. “ యూపీఐ లావాదేవీల రుసుము అత్యంత దురదృష్టకరం. ఇది ప్రపంచవ్యాప్త ఆకర్షణ కలిగిన భారత్ సాధించిన ఘనతను కించపరచడమే. యూపీఐ కారణంగా తగ్గిన లాజిస్టిక్ ఖర్చులను, తద్వారా భారత్ను మరింత పోటీతత్వంగా మార్చే విషయాన్ని విధాన రూపకర్తలు పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యారు,” అని ఆయన ఎక్స్ లో రాశారు.

More Stories
‘మిస్టర్ సింగ్’ పోస్ట్ తర్వాత సిక్కు ట్రక్ డ్రైవర్పై 17కత్తిపోట్లు
30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. అఫ్గాన్పై సిరీస్ క్లీన్ స్వీప్
టిఎంసి పేరు, గుర్తు స్తంభింప చేసిన ఎన్నికల సంఘం