మమతా బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా, ఎన్నికల సంఘం గురువారం ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ (టిఎంసి) “పూలు, గడ్డి” గుర్తును, అధికారిక పేరును స్తంభింపజేసింది. దీనివల్ల, నందిగ్రామ్, రెజినగర్లలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో మమతా బెనర్జీ వర్గం, అరూప్ రాయ్, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం ఆ పేరును లేదా గుర్తును ఉపయోగించకుండా నిషేధం విధించింది.
పార్టీపై ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో, ఉప ఎన్నికలలో పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఉపయోగించకుండా టీఎంసీలోని రెండు వర్గాలను ఎన్నికల సంఘం తన మధ్యంతర ఉత్తర్వులో నిలిపివేసింది. ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు అక్టోబర్ 6న జరగనున్నాయి. టీఎంసీలో మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గం, అరూప్ రాయ్, రితబ్రత నేతృత్వంలోని వర్గం అనే రెండు ప్రత్యర్థి వర్గాలను ఎన్నికల సంఘం గుర్తించింది.
‘ఎన్నికల గుర్తుల (కేటాయింపు, రిజర్వేషన్) ఉత్తర్వు’లోని పేరా 15 ప్రకారం ఈ వివాదాన్ని పరిష్కరించనుంది. తుది నిర్ణయం వెలువడే వరకు, కొనసాగుతున్న ఉప ఎన్నికల ప్రక్రియలో ఏ వర్గం కూడా “ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్” పేరును లేదా పార్టీ “పూలు, గడ్డి” గుర్తును ఉపయోగించడానికి అనుమతించదు. దీనికి బదులుగా, శుక్రవారం ఉదయం 11 గంటల లోపు తమకు నచ్చిన పేర్లను ఎంచుకుని సమర్పించాలని ఆ రెండు వర్గాలకు కమిషన్ సూచించింది.
వారు సమర్పించే పేర్లలో తమ మాతృ సంస్థ అయిన ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ ప్రస్తావనను ఉంచుకునే వెసులుబాటు కూడా వారికి ఉంటుంది. పార్టీకి కేటాయించిన పేరు, గుర్తు ఎవరికి దక్కుతుందనేది కమిషన్ తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు, ఆ రెండు వర్గాలు వేర్వేరుగా కేటాయించిన పేర్లు, ‘స్వేచ్ఛా గుర్తుల’తోనే ఉప ఎన్నికలలో పోటీ చేయాల్సి ఉంటుంది.
ఈ వివాదానికి మూలం 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమిలో చెందిన తర్వాత అప్పటి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో బహిరంగ తిరుగుబాటు మొదలైంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ తర్వాత టీఎంసీ నుండి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీ ఈ తిరుగుబాటుకు ప్రధాన ముఖంగా నిలిచారు. జూన్ ప్రారంభంలో, రాష్ట్ర అసెంబ్లీలోని పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో సుమారు 60 మంది మద్దతు తనకు ఉందని ఆయన ప్రకటించారు.
టీఎంసీ శాసనసభాపక్ష నాయకుడిగా వ్యవహరించేందుకు ఆ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలపడంతో, అసెంబ్లీ స్పీకర్ ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. ఆ సమయంలో, తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతనే తమ అత్యున్నత నాయకురాలిగా భావిస్తున్నప్పటికీ, పార్టీ పనితీరులో మార్పులు రావాలని కోరారు. అలాగే ఆమె మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అయిన అభిషేక్ బెనర్జీ పాత్రను, ఆయనకున్న ప్రభావాన్ని వారు వ్యతిరేకించారు.
తమ తిరుగుబాటు వర్గం మొదట్లో టీఎంసీ నుండి విడిపోవాలని అనుకోలేదని కూడా రిటబ్రత పేర్కొన్నారు. తరువాత ఈ తిరుగుబాటు ఒక విస్తృతమైన సంస్థాగత సవాలుగా మారింది. జూన్ 22న, రిటబ్రత నేతృత్వంలోని వర్గం మమతా బెనర్జీని టీఎంసీ చైర్పర్సన్ పదవి నుండి తొలగించామని, “అసలైన టీఎంసీ”గా తాము పేర్కొన్న దానికి సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ను చైర్పర్సన్గా నియమించామని ప్రకటించింది. మమతకు విధేయులుగా ఉన్నవారు ఈ చర్యను తిరస్కరించారు. ఆమెనే పార్టీ అధినేత్రిగా కొనసాగించారు.
అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు పార్టీ పేరు, గుర్తుపై తమకే హక్కు ఉందని పేర్కొంటూ, ఆ రెండు వర్గాలు అప్పటి నుండి ఎన్నికల కమిషన్ను ఆశ్రయించాయి. టీఎంసీ పేరుతో ఆయా వర్గాలు ఉప ఎన్నికల బరిలో తమ సొంత అభ్యర్థులను నిలపడంతో ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.

More Stories
టాటా సన్స్ ఛైర్మన్గా మరోసారి చంద్రశేఖరన్.. చెల్లదన్న నోయెల్ టాటా
కీలక మావోయిస్టు నేత అసిమ్ మండల్ లొంగుబాటు
బెంగాల్ పాఠ్యప్రణాళికల్లోశ్యామా ప్రసాద్ ముఖర్జీ