బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రహ‌మాన్‌ దూరం

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని  రహ‌మాన్‌ దూరం
 
న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరగనున్న 18వ బ్రిక్స్  శిఖరాగ్ర సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిక్  రహ‌మాన్‌  గైర్హాజరు కానున్నారు. ఈ భేటీకి తమ ప్రధాన మంత్రికి భారత్ నుంచి నేరుగా వ్యక్తిగత ఆహ్వానం అందలేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.  ఈ స‌ద‌స్సుకు త‌మ ప్ర‌ధాని తారిక్ రహ‌మాన్‌కు ఆహ్వానం అంద‌లేద‌ని బంగ్లాదేశ్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి హుమాయున్ క‌బిర్ వెల్ల‌డించారు.

బిమ్‌స్టెక్ కూట‌మికి ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ అధ్య‌క్ష‌త వ‌హిస్తున్నందున ఈ హోదాలో బంగ్లాకు ప్ర‌త్యేక ఆహ్వానం అందింద‌న్న ప్ర‌చారాన్ని హుమాయున్ క‌బిర్ కొట్టిపారేశారు. త‌మ‌కు ఎలాంటి ఆహ్వానం అంద‌లేద‌ని చెబుతూ నిజానికి బ్రిక్స్ కూట‌మిలో బంగ్లాదేశ్‌కు స‌భ్య‌త్వం లేదని, అందువ‌ల్లే భారత్ నుంచి ఆహ్వానం అంద‌లేదని తెలిపారు.  

“మేం ఎలా వెళ్తాం? బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం నుంచి ఎవ‌రికైనా ఆహ్వానం అందిందా? మా దేశ ప్ర‌ధానికి ఆహ్వానం అందింద‌ని ఎవ‌రు చెప్పారు? బిమ్‌స్టెక్ అధ్య‌క్ష‌త‌న ఆహ్వానం అందిందా? అలా అయితే, మ‌మ్మ‌ల్ని ఎందుకు ప్ర‌శ్నిస్తున్నారు? అని హుమాయున్ ప్రశ్నించారు. అయితే, ఈ స‌ద‌స్సుకు బంగ్లాదేశ్ త‌ర‌ఫున ఒక ప్ర‌తినిధి హాజ‌ర‌య్యే అవకాశం ఉంది.

పైగా, రహమాన్ తొలి భారత పర్యటన ఏదైనా బహుపాక్షిక కార్యక్రమంతో ముడిపడి కాకుండా, ద్వైపాక్షిక పర్యటనగా ఉంటుందని కోబీర్ సూచించారు. “మేము ద్వైపాక్షిక పర్యటనలు, చర్చలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాము,” అని ఆయన విలేకరులతో చెప్పారు. “అనుకూల వాతావరణం ఉండి, పరస్పర గౌరవం కొనసాగినప్పుడు ద్వైపాక్షిక పర్యటనలు జరుగుతాయి. తొందరపడాల్సిన అవసరం లేదు,” అని కోబీర్ పేర్కొన్నారు. అనుకూల సమయం చూసుకుని భారత్‌లో ద్వైపాక్షిక పర్యటనను ఏర్పాటు చేసే దిశగా బంగ్లాదేశ్ కృషి చేస్తోందని ఆయన తెలిపారు

ఇక‌, బిమ్‌స్టెక్ కూట‌మికి ఈసారి బంగ్లాదేశ్ అధ్య‌క్షత వ‌హిస్తోంది. గ‌త ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించింది. కేవలం ‘బిమ్‌స్టెక్ ఛైర్‌పర్సన్’ హోదాకు మాత్రమే భారత్ ఆహ్వాన పత్రికను పంపించడంతో దేశ సార్వభౌమాధికార ప్రతిపత్తిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఒక ప్రాంతీయ కూటమి అధిపతిగానే ఆహ్వానించారనే కారణంతో ఈ సదస్సుకు హాజరుకాకూడదని బంగ్లా ప్రధాని నిర్ణయించుకున్నట్లు  తెలుస్తున్నది.