దుర్గాపూజ సమీపిస్తుండగా బంగ్లాదేశ్‌లో ముగ్గురు హిందువుల హత్య

దుర్గాపూజ సమీపిస్తుండగా బంగ్లాదేశ్‌లో ముగ్గురు హిందువుల హత్య
* వేర్వేరు చోట్ల ఆరేళ్ళ బాలిక, ఓ మహిళా, ఓ స్వర్ణకారుడు మృతి 
 
సిల్హెట్‌లో ఒక గర్భిణీ స్త్రీ, ఆమె నాలుగేళ్ల కుమార్తె మృతదేహాలు లభించిన రెండు రోజులకే, సెప్టెంబర్ 7న వేర్వేరు ఘటనల్లో ఆరేళ్ల బాలికతో సహా ముగ్గురు హిందువులు హత్యకు గురయ్యారనే ఆరోపణల నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీ వర్గం పెరుగుతున్న భయంతో దుర్గా పూజకు సిద్ధమవుతోంది.   ఈ ఘటనలకు కొన్ని రోజుల ముందే రంగ్‌పూర్‌లో రిటైర్డ్‌ హిందూ ఉపాధ్యాయు డు గణపతి చక్రవర్తి, ఆయన కుటుంబంలోని మరో ముగ్గురు హత్యకు గురయ్యారు.
తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ పాలనలో తీవ్రవాద శక్తులు హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నాయన్న ఆరోపణలను ఈ తాజా మరణాలు మరింత తీవ్రతరం చేశాయి.   తారిక్ రెహమాన్ పాలనలోని ఆరు నెలల్లో కనీసం 20 మంది హిందువులు దారుణంగా హత్యకు గురయ్యారు.  సెప్టెంబర్ 7న, సుమారు ఎనిమిది గంటల పాటు కనిపించకుండా పోయిన 6 ఏళ్ల బితి రాణి, కురిగ్రామ్‌లో మృతదేహంగా కనుగొన్నారు. అదే రోజు, కాక్స్ బజార్‌లోని మహేష్‌ఖాలిలో  రాణి సుశీల్‌ హత్యకు గురయ్యారు. అదే రోజు, నౌగావ్‌లోని మహాదేబ్‌పూర్‌లో ఒలిఫ్ చంద్ర దత్తా హత్యకు గురయ్యారు. 
 
ఒకే రోజు ముగ్గురు హిందువుల మరణాలు ఆ వర్గ సభ్యులలో ఇప్పటికే తీవ్రంగా ఉన్న అభద్రతా భావాన్ని మరింత పెంచాయి. అంతకు ముందు  సెప్టెంబర్ 5న, సిల్హెట్‌లోని జాకిగంజ్‌లో గర్భవతిగా ఉన్న 35 ఏళ్ల చంపా రాణి దాస్, ఆమె నాలుగేళ్ల కుమార్తె హృది దాస్‌ల ఉరి వేసుకున్న మృతదేహాలను పోలీసులు వారి ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ వరుస సంఘటనలు హిందూ కుటుంబాలను రాబోయే దుర్గా పూజ వైపు సంబరాలకు బదులుగా ఆందోళనతో చూసేలా చేశాయి. 
నౌగావ్‌ జిల్లా మహాదేవ్‌పూర్‌ లో 45 ఏళ్ల హిందూ స్వర్ణకారుడు అలీఫ్‌ చంద్ర దత్తా హత్యకు గురయ్యాడు. అలీఫ్‌ చంద్ర దత్తా సోమవారం రాత్రి 8.30 గంటలకు మహాదేవ్‌పూర్‌ బజార్‌లోని తన నగల దుకాణం నుంచి ఇంటికి బయలుదేరాడు. రాత్రి 9 గంటల సమయంలో దులాల్‌పారా ప్రాంతంలోకి రాగానే కొందరు దుండగులు అతడిని అడ్డుకున్నారు. పదునైన ఆయుధంతో దాడి చేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న బంగారం, 7 లక్షల బంగ్లాదేశీ టాకాలను దోచుకుని పారిపోయారు. 

తీవ్రంగా గాయపడిన దత్తాను కుటుంబసభ్యులు, స్థానికులు రాజ్‌షాహీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ దత్తా మృతిచెందారు. ఇది కేవలం దోపిడీ ఘటననా? మరేదైనా కక్ష ఉందా? అన్నది ఇంకా తేలలేదని మహాదేవ్‌పూర్ పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. 

ఇక‌ కాక్స్‌బజార్‌ జిల్లా మహేశ్‌ఖాలీ ఉపజిల్లాలో 45 ఏళ్ల హిందూ మహిళ రాణి సుశీల్‌ హత్యకు గురైంది. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో హోనాక్‌ యూనియన్‌లోని తన ఇంట్లో ఆమె వంట చేస్తోంది. దొంగతనం కోసం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అతడిని గమనించిన రాణి కేకలు వేయడంతో ఆమె ముఖాన్ని పట్టుకుని పలుమార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన ఆమెను చకారియా ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి తర్వాత మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. “తీవ్రవాద బృందాలు ఇప్పుడు హిందూ మైనారిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి,” అని నౌగావ్‌కు చెందిన ఒక గ్రామస్థుడు పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులలో ఒకరు, పేరు చెప్పడానికి ఇష్టపడకుండా మాట్లాడుతూ, తగిన రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 

“తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ హిందూ వర్గాలను రక్షించడం లేదు. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు శాంతిభద్రతలు లేవు,” అని ఆ కుటుంబ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఢాకా నివాసి పర్వేజ్ మొల్లా మాట్లాడుతూ: “షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పరిస్థితి మరింత దిగజారుతోంది,” అని చెప్పారు. 
 
బంగ్లాదేశ్ ప్రతి మతానికి చెందిన పౌరులదని, మైనారిటీలకు కూడా అందరిలాగే భద్రత పొందే హక్కు ఉందని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. మతం వ్యక్తిగతమైనది కానీ భద్రత అందరికీ చెందుతుందని రెహమాన్  చెప్పారు. చాలా మంది హిందువులలో విశ్వాసం సన్నగిల్లుతున్న తరుణంలో దుర్గా పూజ సమీపిస్తోంది. ఈ పండుగ సాధారణంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న హిందూ నివాస ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తుంది.
 
దేవాలయాలను అలంకరిస్తారు. పూజా కమిటీలు వేడుకలను నిర్వహిస్తాయి. కుటుంబాలు తమ పూర్వీకుల ఇళ్లకు ప్రయాణిస్తాయి. అందంగా అలంకరించిన మండపాల చుట్టూ పిల్లలు గుమిగూడుతున్నారు. అయితే, ఈ ఏడాది భద్రతకు పెరుగుతున్న డిమాండ్ మధ్యే ఏర్పాట్లు జరుగుతున్నాయి.