ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు 100 శాతం ఎల్‌నినో ప‌రిస్థితులు

ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు 100 శాతం ఎల్‌నినో ప‌రిస్థితులు

రాబోయే రోజుల్లో ఎల్ నినో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మ‌రింత భీక‌రంగా మార‌నున్నాయి. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు 100 శాతం వాతావ‌ర‌ణం మ‌రింత వేడిగా మార‌నున్న‌ట్లు ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ(డబ్ల్యూఎంఓ) హెచ్చ‌రిక జారీ చేసింది. భూమ‌ధ్య‌రేఖ స‌మీపంలోని ప‌సిఫిక్ స‌ముద్రంలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో దాని ప్ర‌భావం వ‌చ్చే ఏడాది వ‌ర‌కు కొన‌సాగున్న‌ట్లు ప్ర‌పంచ వాతావ‌ర‌ణ‌ సంస్థ నిర్ధారించింది. 

దీని వ‌ల్ల వ‌ర్షాలు, వాతావ‌ర‌ణంలో మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. కొన్ని చోట్ల ఆక‌స్మిక వ‌ర‌ద‌లు సంభ‌వించ‌నున్నాయి. మ‌రికొన్ని ప్ర‌దేశాల్లో క‌రువు తాండ‌వించ‌నున్న‌ది. ఇక కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ తెలిపింది. డబ్ల్యుఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టీ సౌలో ఓ ప్రకటనలో స్పానిష్‌లో ఎల్‌నినోను చిన్న పిల్లోడిగా భావిస్తార‌ని, కానీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెను విధ్వంసాలు సృష్టించే సామ‌ర్థ్యం దానికి ఉంటుంద‌ని పేర్కొన్నారు. 

ఇప్ప‌టికే ఎల్‌నినో ప్ర‌భావం క‌నిపిస్తోంద‌ని, అనేక ప్రాంతాల్లో క‌ర‌వులు, వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయ‌ని ఆమె తెలిపారు. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ఉదృతం అవుతుంద‌ని, దీని వ‌ల్ల ప్ర‌భావం కూడా పెర‌గ‌నున్న‌ట్లు ఆమె హెచ్చరించారు. అయితే వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఎల్‌నినో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉంటాయ‌ని భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక జారీ చేసిన కొన్ని రోజుల్లోనే ప్ర‌పంచ వాతావ‌ర‌ణ శాఖ కూడా హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఎల్ నినో స‌ద‌ర‌న్‌ ఆసిలేష‌న్‌(ఈఎన్ఎస్ఓ) అనేది మూడు ద‌శ‌ల్లో ఉంటుంది. దాంట్లో ఎల్ నినో ఓ ప్ర‌క్రియ‌. ప‌సిఫిక్ స‌ముద్రంలో ఉన్న వాతావ‌ర‌ణ ప్ర‌భావం వ‌ల్ల ఎల్ నినో ఏర్ప‌డుతుంది. దీని ప్ర‌భావం వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా వాతావ‌ర‌ణంలోనూ మార్పులు ఉంటాయి. ఎల్‌నినో వ‌ల్ల భూగ్ర‌హం వేడెక్కే ఛాన్సు ఉంది. ఇక లా నినో వ‌ల్ల చాలా వ‌ర‌కు శీత‌ల వాతావ‌ర‌ణం ఉంటుంది. 

ఈఎన్ఎస్వో ప్ర‌క్రియ‌లో త‌ట‌స్థ ద‌శ కూడా ఉంటుంది. ఎల్‌నినో పరిస్థితుల ప్ర‌భావం వ‌ల్ల భార‌త్‌లో సాధార‌ణంగా త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు అవుతుంది. అయితే తాజా ఎల్ నినో ప‌రిస్థితుల వ‌ల్లే ఇండియాలో త‌క్కువ వ‌ర్ష‌పాతం కురిసిన‌ట్లు ఆగ‌స్టు 31వ తేదీన ఐఎండీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆగ‌స్టు నెల‌లో దేశ‌వ్యాప్తంగా 16 శాతం త‌క్కువ వ‌ర్షపాతం న‌మోదు అయిన‌ట్లు ఐఎండీ చెప్పింది. 

1901 త‌ర్వాత భార‌త్‌లో అత్యంత వేడి క‌లిగిన ఆగ‌స్టు నెల‌గా రికార్డు అయ్యింది. సెప్టెంబ‌ర్‌లోనూ ఎల్‌నినో వ‌ల్ల స‌గ‌టున 91 శాతం త‌క్కువ వ‌ర్షపాతం న‌మోదు కానున్న‌ట్లు ఐఎండీ అంచ‌నా వేసింది. ఐఎండీ డేటా ప్ర‌కారం భార‌త్‌లో సెప్టెంబ‌ర్ నెల‌లో 1971 నుంచి 2020 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా స‌గ‌టున వ‌ర్ష‌పాతం 167.9 మిల్లీమీట‌ర్లుగా ఉంది. ఈసారి ఐఎండీ హెచ్చ‌రిక నేప‌థ్యంలో శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయ‌ని భావిస్తున్నారు. 

ఢిల్లీకి చెందిన క్లైమేట్ ట్రెండ్స్ అనే సంస్థ ప్ర‌కారం ఉత్త‌ర భార‌తంలో శీతాకాలం త‌గ్గిన‌ట్లు తెలిసింది. ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌లు అక్క‌డ వేడిగా మారుతున్న‌ట్లు ఆ సంస్థ గుర్తించింది. క్లైమేట్ ట్రెండ్స్ ప్ర‌కారం గ‌త ద‌శాబ్ధ కాలంలో ఫిబ్ర‌వ‌రిలో 0.69 డిగ్రీలు సెల్సియ‌స్‌, మార్చిలో 0.58 డిగ్రీల సెల్సియ‌స్‌, ఏప్రిల్‌లో 0.66 డిగ్రీల సెల్సియ‌స్ మేర ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. 

ఇలా ఉష్ణోగ్ర‌తలు పెర‌గ‌డం వ‌ల్ల ఉత్త‌రాదిలో ర‌బీలో వేసే గోధుమ పంట‌పై ప్ర‌భావం ప‌డుతోంది. వాతావ‌ర‌ణ మార్పుల ప్ర‌భావం వ‌ల్ల విత్త‌న ఉత్ప‌త్తి స‌మ‌స్య‌గా మారుతోంద‌ని, దీని వ‌ల్ల గోధ‌మ పంట పండించే ప్రాంతాల్లో దిగుబ‌డి తగ్గుతున్న‌ట్లు ఓ స్ట‌డీ ద్వారా తేల్చారు.