బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితిని ‘జాతీయ సంక్షోభం’గా అభివర్ణిస్తూ ఆగష్టు 2024లో తనను అధికారం నుంచి తొలగించేలా చేసిన కోటా వ్యతిరేక నిరసనలపై పూర్తిస్థాయి, స్వతంత్ర విచారణ జరపాలని పిలుపునిచ్చారు. ఢాకా నుంచి న్యూఢిల్లీకి పారిపోయిన హసీనా, తాను డిసెంబర్లో తిరిగి వచ్చి, తనపై ఉన్న చట్టపరమైన కేసులను, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తన గైర్హాజరీలో విధించిన మరణశిక్షతో సహా, ఎదుర్కోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
భారత్ లోని రెండు ప్రముఖ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలో, తాను భారతదేశానికి వస్తానని ఊహించలేదని నొక్కిచెబుతూ, 78 ఏళ్ల హసీనా, తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ప్రభుత్వానికి, తన పార్టీ అయిన అవామీ లీగ్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు.
“నేను డిసెంబర్ నెలలో బంగ్లాదేశ్కు తిరిగి రావాలని భావిస్తున్నట్లు చెప్పాను. నిర్దిష్ట తేదీ, సమయం, మార్గాన్ని సరైన సమయంలో ప్రకటిస్తాను. బంగ్లాదేశ్ ఒక తీవ్రమైన జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్యానికి ఆస్కారం లేకుండా చేశారు. న్యాయవ్యవస్థను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. మీడియా స్వేచ్ఛను పరిమితం చేశారు. శాంతిభద్రతలు బలహీనపడ్డాయి. మైనారిటీలు అభద్రతాభావంతో ఉన్నారు,” అని తెలిపారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ న్యూఢిల్లీ పర్యటనకు తనను అప్పగించడాన్ని ఒక షరతుగా పెట్టిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని హసీనా ప్రశ్నించారు. భారత్లో తాను చేసిన బహిరంగ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎందుకు ప్రభావం చూపాలని ఆమె ప్రశ్నించారు. బ్రిటన్లో ఉన్నప్పుడు రెహమాన్ చేపట్టిన రాజకీయ కార్యకలాపాల గురించి కూడా ప్రస్తావిస్తూ అప్పట్లో తాను బ్రిటన్ జోక్యాన్ని కోరలేదన్న విషయం ఆమె గుర్తుచేశారు.
ఆమె ఇంకా ఇలా పేర్కొన్నారు: “ఇది ఇకపై కేవలం అవామీ లీగ్ సమస్య మాత్రమే కాదు. ఇది ఒక జాతీయ సంక్షోభం. దేశంలోని అతిపెద్ద రాజకీయ శక్తులలో ఒకదానిపై నిషేధం విధించారు. దాని లక్షలాది మంది మద్దతుదారులకు సాధారణ రాజకీయ హక్కులను నిరాకరించారు. ఒక దేశం తన సొంత ప్రజలలో ఇంత పెద్ద విభాగాన్ని దూరం పెట్టడం ద్వారా స్థిరత్వానికి తిరిగి రాలేదు.”
కాగా, బంగ్లాదేశ్కు నష్టం కలిగించేందుకు పన్నిన రాజకీయ కుట్రలో తన మాజీ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ ‘లబ్ధిదారుడు, క్రియాశీల భాగస్వామి’ అని ఆమె అభివర్ణించారు. అదే సమయంలో, తనను పదవి నుంచి తొలగించడాన్ని మిలిటెంట్లు, మత ఛాందసవాదులు, ఇతర శక్తులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయని ఆమె ఆరోపించారు.

More Stories
వందేళ్ల నాటి ఆలయం కూల్చివేత `అభ్యంతరకర విధ్వంస చర్య’
ఇరాన్కు రష్యా సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ టెక్నాలజీ
నేపాల్ జల విద్యుత్ సొరంగాల్లో భారత్, చైనా సైనిక నిపుణుల అన్వేషణ