శతాబ్దానికిపైగా ఎన్నడూ లేనంతగా ఎల్‌నినో ప్రభావం

శతాబ్దానికిపైగా ఎన్నడూ లేనంతగా ఎల్‌నినో ప్రభావం

* భారత్‌లో పట్టుకోల్పోతున్న రుతుపవనాలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఒక శతాబ్దానికిపైగా కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ పరిణామం కరువు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, ఇతర విపరీతమైన వాతావరణ పరిస్థితుల ముప్పును పెంచుతుందని మెట్‌ ఆఫీస్‌ తెలిపింది. సాధారణ ఎల్‌ నినో ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీల సెల్పియస్‌ మేర పెరుగుతాయి.

అయితే రాబోయే నెలల్లో ఈ ప్రక్రియలో రికార్డు స్థాయిలో మూడు డిగ్రీల సెల్సియస్‌ కంటే అధిక పెరుగుదల నమోదవుతుందని అంచానాలు సూచిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది మునుపెన్నడూ లేని అసాధారణ పరిణామం అని మెట్‌ ఆఫీస్‌ లాంగ్‌ రేంజ్‌ ఫోర్‌కాస్టింగ్‌ హెడ్‌ ఆడమ్‌ స్కైఫ్‌ పేర్కొన్నారు. ఒకవేళ ఉష్ణోగ్రతల పెరుగుదల ఊహించిననట్లే జరిగితే ప్రస్తుత 2026లో ఇప్పటివరకూ చూసిన ఎల్‌ నినో, దాని ప్రపంచవ్యాప్త ప్రభావాల స్థాయిని మించిపోతుందని ఆయన తెలిపారు.  

మానవ తప్పిదాల వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు తోడు ఈ ఎల్‌ నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2027 అత్యంత వేడిగా ఉండే సంవత్సరంగా మారే అవకాశం ఉందని మెట్‌ ఆఫీస్‌ హెచ్చరించింది.  ఎల్‌నినో కారణంగా భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండగా, అట్లాంటిక్‌ మహాసముద్రంలో తుపానుల తీవ్రత తగ్గింది. ఈ ఏడాది చివర్లో ఎల్‌ నినో గరిష్ఠ స్థాయికి చేరుకోనున్నదని ఇది, 19వ శతాబ్దం తరువాత అత్యంత శక్తివంతమైన పరిణామం కావచ్చని మెట్‌ ఆఫీస్‌ తెలిపింది. 

భారతదేశం నుంచి రుతుపవనాలు ఇప్పుడే పూర్తిగా నిష్క్రమించడం లేదు. కానీ వాటి వర్షపాతం క్రమంగా నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితం అవుతున్నది.  ఈశాన్య మధ్యప్రదేశ్‌పై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మధ్య, తూర్పు భారతదేశంలో నైరుతి రుతుపవనాలను చురుగ్గా ఉంచడంలో సహాయపడుతున్నది. తాజా సూచన ప్రకారం దేశంలోని పలు రాష్ర్టాల్లో రాబోయే రోజుల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మధ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమ, తమిళనాడులో చెదరుమదురు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది.  భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు జూన్‌ 4న ప్రవేశించాయి. ఆగస్టు 21 నాటికి అసమాన వర్షపాతాన్ని మాత్రమే అందించాయి. దీంతో దేశం 14 శాతం వర్షపాత లోటును ఎదుర్కొంటున్నది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 254.9 మిమీ కాగా, ఇందులో 94 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది