సరిహద్దు సమస్యపై చర్చలకు నేడే చైనాకు అజిత్ దోవల్

సరిహద్దు సమస్యపై చర్చలకు నేడే చైనాకు అజిత్ దోవల్

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) చైనాలో పర్యటించనున్నారు. చైనాతో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారానికి అక్కడి ఉన్నతాధికారులతో దోవల్ చర్చించనున్నారు.  సోమవారం దోవల్ చైనా రాజధాని బీజింగ్ వెళ్తారు. అక్కడ సరిహద్దు వివాదంపై చైనా ప్రతినిధి వాంగ్ యితో మంగళవారం చర్చలు జరుపుతారు.

ఇవి ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యపై జరగనున్న 25వ దశ చర్చలు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) వద్ద ఉద్రిక్తతలు తగ్గించేందుకు, దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఈ చర్చలు జరుగుతాయి. రాజకీయ, ద్వైపాక్షిక చర్యల ద్వారా సరిహద్దు సమస్యకు ముగింపు పలకాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ సమస్య ప్రాథమిక అంశాలపై ఈ చర్చలో ప్రధానంగా దృష్టి సారిస్తారు.

ఎల్ఏసి వెంబడి అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబడినట్లు ఇటీవల వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. నివేదించిన ఈ చొరబాట్ల స్థాయిపై రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ఏదీ జారీ చేయలేదు. తూర్పు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌తో సహా ఎల్ఏసి వెంబడి ఉన్న పరిస్థితిని సమీక్షించడం,  ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించే యంత్రాంగాలను అన్వేషించడం అనే రెండు విస్తృత అంశాలపై ఈ చర్చలు దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తున్నది. 

సరిహద్దులో ఇప్పటికే ఇరు దేశాల సైన్యం మోహరించి ఉంది. పరిస్థితులు అప్పుడప్పుడూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్య పరిష్కారం కోసం 2003 నుంచి రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరుగుతూ వస్తోంది. అందులో ఇది 25వ సమావేశం. సరిహద్దు వివాదం, ఎల్ఏసి విస్తృత నిర్వహణపై చర్చల కోసం భారత్, చైనాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల యంత్రాంగం ప్రధాన రాజకీయ మార్గాలలో ఒకటిగా కొనసాగుతోంది.

ఇండియా-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దుపై వివాదం నడుస్తోంది. రెండు దేశాలు ఈ ప్రదేశాలు తమవంటే తమవి అని చెప్పుకొంటున్నాయి. దీంతో వివాదం కొనసాగుతోంది.  సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించాల్సి ఉండగా, దానికి ముందుగా జరగనున్న ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

షీ పర్యటనపై ఇంకా అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఆయన ఇందులో పాల్గొంటారని ఇరుపక్షాల అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఇటీవలి కాలంలో, ఆ రెండు దేశాల మధ్య సైనిక మరియు దౌత్యపరమైన స్థాయిలలో అనేక విడతల చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసి) వెంబడి బలగాల ఉపసంహరణ, దళాల విరమణ, సరిహద్దు ప్రాంతాలలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడమే ఈ చర్చల లక్ష్యం.