స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలపిస్తున్నప్పుడు తలెత్తిన వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని ఉర్వా పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఆదివారం అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు; ఈ వివాదం జాతీయ గీతానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసిందని వారు ఆరోపించారు. పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, అయితే బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సంబంధిత నిబంధనల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని బీజేపీ నాయకులు వికాస్ కె, రాజ్గోపాల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమ దృశ్యాలలో, ‘వందేమాతరం’ ఆలపిస్తుండగా పార్టీ సీనియర్ నాయకులు తమలో తాము మాట్లాడుకోవడం కనిపించడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. వారి ప్రవర్తన జాతీయ గీతాన్ని అవమానించడమేనని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీకి జాతీయ గీతం ‘వందేమాతరం’ పట్ల తీవ్ర అసౌకర్యం, అగౌరవం ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శించారు.
అంతకుముందు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆరోపించారు. బంకిమ్ చంద్రను “సాహిత్య సామ్రాట్”గా గౌరవించే ఆ రాష్ట్ర ప్రజలను ఈ ఘటన తీవ్రంగా బాధించిందని ఆయన తెలిపారు. గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికారి డిమాండ్ చేశారు, లేనిపక్షంలో విస్తృత నిరసనలు తలెత్తవచ్చని హెచ్చరించారు. అలాగే, జాతీయ గీతాన్ని అవమానించడం దేశాన్ని అవమానించడమేనని పేర్కొంటూ, పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరుతూ ఆయన వివరణ అడిగారు.
మరోవంక, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ‘వందేమాతరం’ గీతానికి జరిగిన అవమానంగా తాను భావిస్తున్న ఘటనపై, బీజేపీ ఎమ్మెల్యే, బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ్ ప్రత్యక్ష వారసుడైన సుమిత్రో ఛటర్జీ సోనియా గాంధీకి లేఖ రాసి తన “తీవ్ర ఆవేదనను” వ్యక్తం చేశారు. తన లేఖలో, బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ్ రచించిన గీతం పూర్తి రూపాన్ని ఆలపించే సమయంలో జరిగినట్లుగా ఆరోపిస్తున ఘటనకు సంబంధించి, భారత పౌరులకు – ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు – బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఛటర్జీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు, సోనియా గాంధీ ప్రదర్శించిన “స్పష్టమైన అసౌకర్యం, అసహనం, దానిని ఆపడానికి ఆమె చేసిన పదేపదే ప్రయత్నాలు” తనను తీవ్రంగా కలచివేసినట్లు ఆ బీజేపీ నేత పేర్కొన్నారు.

More Stories
జిన్పింగ్ పర్యటన వ్యాపార సంబంధాలను మెరుగు పరుస్తుందా?
పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలు ప్రధానం
ఎర్రకోట పేలుడు సూత్రధారి ఉమర్ ఉన్ నబీ .. ఎన్ఐఏ ఛార్జిషీట్