దేశవ్యాప్తంగా తమ సంస్థకు చెందిన డజన్ల కొద్దీ సభ్యులను “గుర్తుతెలియని వ్యక్తులు” హతమార్చారని నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా (ఎల్ఈటి)కు చెందిన మరో కార్యకర్త ప్రకటించిన కొద్ది రోజులకే, పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో ఆ సంస్థకు చెందిన ఒక సీనియర్ కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లు సమాచారం. ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్, ప్రార్థనలు చేయడానికి ఇస్లామాబాద్లోని ఖుబా మసీదుకు వెళ్లే ముందు, తనకు పరిచయం లేని ఒక రెస్టారెంట్లో భోజనం చేసినట్లు తెలుస్తోంది.
అతను మసీదు ప్రవేశ ద్వారం దగ్గర అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. అతని మరణానికి దారితీసిన పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. కారణంపై తక్షణ అధికారిక వివరణ ఏదీ వెలువడలేదు. లష్కరేకు చెందిన ముసుగు సంస్థ జమాత్ ఉద్ దవాలో ఇతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానా, లేదా విషప్రయోగం కారణంగా మరణించాడా అనేది కచ్చితంగా తెలియరాలేదు.
అబ్దుల్ అజీజ్ జమ్ముశ్మీర్లో ప్రవేశించే ఉగ్రవాదులకు సేఫ్హౌసలు, ఆర్థిక సాయం, తప్పుడు పత్రాలు సమకూర్చడం వంటివి చేస్తుంటాడు. నీలమ్ వ్యాలీ, ముజఫరాబాద్ మీదుగా ఉగ్రవాదులను పంపుతుంటాడు. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం సమకూర్చడం కూడా ఇతడి బాధ్యత.
ఖారీ సయీద్ మరణానికి కొన్ని రోజుల ముందు, లష్కర్తో సంబంధం ఉన్న కార్యకర్త రిజ్వాన్ హనీఫ్, పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలలో నిషేధిత సంస్థకు చెందిన సుమారు 30 మంది సభ్యులను “గుర్తుతెలియని వ్యక్తులు” హతమార్చారని పేర్కొన్న ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. పెషావర్, కరాచీ, రావల్పిండి, రావల్కోట్, ముజఫరాబాద్తో సహా పలు ప్రదేశాలలో 30 మందికి పైగా లష్కర్-ఎ-తైబా (ఎల్ఈటి) ఉగ్రవాదులు హతమయ్యారని హనీఫ్ పేర్కొన్నాడు.
గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఈ హత్యలు జరిగాయని, పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో (పిఓకె) పనిచేస్తున్న సంస్థ సభ్యులు కూడా ఇందులో ఉన్నారని అతను చెప్పినట్లు సమాచారం. ఇటువంటి హత్యలు జరుగుతున్నట్లు లష్కరే బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి.

More Stories
ఉద్యోగం పోతే తక్షణమే అమెరికాను వీడాల్సిందే!
ఆరు నెలల్లో 3,323 మంది భారతీయులను బహిష్కరించిన కెనడా
ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబాను ఆసుపత్రికి తరలించారా?