20 శాతం భర్తీకాని ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు

20 శాతం భర్తీకాని ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు
ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు 70నుంచి 80శాతం వరకు మాత్రమే కళాశాలల్లో రిపోర్ట్ చే సినట్లు తెలిసింది. మిగతా 20 శాతం కళాశాలల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో 79,891 సీట్లు కేటాయించగా, 8,162 మిగిలాయి. సీట్లు పొందిన వా రిలో 19,325 మంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చే యలేదు.
దాంతో మొత్తం సీట్లతో పాటు అదనంగా అందుబాటులోకి వచ్చిన 4,347 సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు.  రెండు విడతల్లో కలిపి మొత్తం 80,167 సీట్లు కేటాయించగా, 71,452 మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేయగా, 8,710 మంది రిపోర్టింగ్ చేయలేదు. తుది విడత కౌన్సెలింగ్‌లో 22,972 అందుబాటులో ఉండగా, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం ముగిసింది.ఈ నెల 5వ తేదీన చివరి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు.
ఎప్‌సెట్‌లో ర్యాంకు సాధించి ఎప్‌సెట్‌తో పాటు ఇతర కౌన్సెలింగ్‌లలో కూడా పాల్గొంటున్న మెరిట్ విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటి వంటి జాతీ య సంస్థలలో సీటు లభిస్తే అక్కడికే వెళ్తున్నారు.  ఈసారి టాప్ కళాశాలల్లో సీట్లకు కూడా ఇదివరకు ఉన్న డిమాండ్ కనిపించడం లేదు.  ఇదివరకు టాప్ కళాశాలల్లో కన్వీనర్ కోటాతో పాటు యాజమాన్య కోటా సీట్లు 100 శాతం భర్తీ అయ్యేవి. యాజమాన్య కోటా సీట్ల కోసం కనీసం ఆరు నెలల ముందే అడ్వాన్స్ చెల్లించి సీటు రిజర్వ్ చే సుకునేవారు.
కానీ, గత రెండు మూడేళ్లుగా టాప్ కళాశాలల్లో సైతం కొన్ని బ్రాంచీల్లో సీట్లు మిగులుతున్నాయి. మెరిట్ విద్యార్థులు ఐఐటి,ఎన్‌ఐటి, ఇతర జాతీయ విద్యాసంస్థల వైపే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ఎప్‌సెట్‌కు హాజరయ్యే మెరిట్ విద్యార్థులు, జెఇఇ వంటి జాతీయ ప్రవేశ పరీక్షకు కూడా సీరియస్‌గా సిద్దమై పరీక్ష రాస్తున్నారు. దాంతో వారికి రెండు పరీక్షల్లో మంచి ర్యాంకులే వస్తున్నాయి. మొదటి ప్రాధాన్యత మాత్రం జెఇఇకే ఇస్తున్నారు.
ఈ ఏడాది ఎప్‌సెట్ ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో సుమారు 15 శాతం మంది ఐఐటి- జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్ జాతీయ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఐఐటి, ఎన్‌ఐటిల్లో సీట్లు పొందారు.  ఇదివరకు ఇక్కడి టాప్ కళాశాలల్లో ఒక సీటు కోసం వందల మంది మెరిట్ విద్యార్థులు పోటీ పడేవారు. కానీ ఏడాదికి ఏడాదికీ పరిస్థితి మారుతూ వస్తోంది. మెరిట్ విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటిలకే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కళాశాలల వైపు చూడటం లేదు. ఖర్చు ఎక్కువైనా ఎన్‌ఐటి, ఐఐటి, ఇతర జాతీయ సంస్థల్లో ఇంజనీరింగ్ చేయడమే ఉత్తమమని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.