బీహార్‌ పేప‌ర్ లీక్ లో రూ.1.2 కోట్లు వ‌సూలు చేసిన డాక్ట‌ర్ అరెస్ట్‌

బీహార్‌  పేప‌ర్ లీక్ లో రూ.1.2 కోట్లు వ‌సూలు చేసిన డాక్ట‌ర్ అరెస్ట్‌
బిహార్‌ను కుదిపేసిన బీపీఎస్‌సీ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష‌-3 పేపర్ లీక్ కేసులో ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ మనీశ్ కుమార్‌ ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ డాక్ట‌ర్‌ పరీక్షకు ముందే 30 మంది అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు అందించి, వారి నుంచి సుమారు రూ.1.2 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈవోయూ అధికారుల కథనం ప్రకారం డాక్టర్ మనీశ్ కుమార్ ఎలాంటి ఆనవాళ్లు లేకుండా సీల్డ్ ప్రశ్నాపత్రాల బాక్సులను తెరిచి, తిరిగి మూసివేయడంలో నైపుణ్యం సంపాదించాడు. ప్రతి అభ్యర్థి నుంచి రూ.50,000 కమీషన్‌గా తీసుకున్నాడు. తన సహచరులైన డాక్టర్ శివ్, డాక్టర్ శుభంతో కలిసి ఈ రాకెట్‌ను నడిపినట్లు గుర్తించారు.  2024 మార్చి 15న జరిగిన పరీక్షకు ముందు పట్నాలోని ఓ హోటల్‌లో 30 మంది అభ్యర్థులకు బస ఏర్పాటు చేసి, వారికి ముందుగానే ప్రశ్నాపత్రాన్ని అందించాడు. మార్చి 14న భాబువాలోని కోహినూర్ హోటల్‌పై అధికారులు దాడి చేసినప్పటికీ మనీశ్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. 

అయితే హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో పోలీసులు అతడిని గుర్తించారు. పట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్, నలంద మెడికల్ కాలేజ్ హాస్పిటల్విద్యార్థుల డేటాను పరిశీలించి అతడి గుర్తింపును ధ్రువీకరించుకున్నారు. ఈ డాక్ట‌ర్ మనీశ్ పేపర్ లీక్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సంజీవ్ ముఖియా కుమారుడని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 296 మందిని అరెస్ట్ చేశారు.

కాగా, పరీక్షల మోసాల కేసులలో విచారణను వేగవంతం చేసే లక్ష్యంతో, పేపర్ లీక్‌లు, వ్యవస్థీకృత మోసాలు, పరీక్షల అవకతవకలకు సంబంధించిన కేసులను ప్రత్యేకంగా విచారించడానికి బీహార్ ప్రభుత్వం మూడు ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. పాట్నా హైకోర్టు ఆదేశాల మేరకు, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 2024 నిబంధనల ప్రకారం ఈ కోర్టులను పాట్నా, లఖిసరాయ్ మరియు పూర్ణియాలలో ఏర్పాటు చేశారు. 

 
ప్రాధాన్యతా విచారణలు, ప్రత్యేక రోస్టర్లు, సాక్ష్యాలు, సాక్షి వాంగ్మూలాలను వేగంగా నమోదు చేయడం ద్వారా ఇటువంటి కేసులను మూడు నెలల్లోపు పరిష్కరించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.   పాట్నా ఫాస్ట్-ట్రాక్ కోర్టు, టిఆర్ఈ-3 పేపర్ లీక్, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష లీక్, 67వ బిపిఎస్ఈ ప్రిలిమినరీ పరీక్ష కేసు మరియు అసిస్టెంట్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఎఈడిఓ) పేపర్ లీక్‌తో సహా పలు ప్రముఖ పరీక్షల మోసాల కేసులను విచారించనుంది.