నల్ల సముద్రం గుండా ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకలో ఉన్న భారత జాతీయుడు మరణించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) శుక్రవారం ధృవీకరించింది. శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఎంవి ఒమోర్ఫీ అనే వాణిజ్య నౌక జూలై 18న నల్ల సముద్రం గుండా ప్రయాణిస్తుండగా, ‘రష్యా ప్రాదేశిక జలాల్లో’ దాడికి గురైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
“అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ దాడిలో ఒక భారత జాతీయుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. దాడి జరిగిన సమయంలో, ముగ్గురు భారత జాతీయులతో సహా 10 మంది సిబ్బంది నౌకలో ఉన్నారని అది వెల్లడించింది.
“నౌకలో ఉన్న మిగతా ఇద్దరు భారత జాతీయులు క్షేమంగా ఉన్నారని సమాచారం,” అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఈ దాడిని ఖండిస్తూ, ఈ ఘటనను “తీవ్ర ఆందోళన కలిగించే విషయం”గా అభివర్ణించింది. “వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న ఇటువంటి దాడులను భారతదేశం నిస్సందేహంగా ఖండిస్తుంది. నౌకాయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ వాణిజ్యంపై ముప్పు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది,” అని అది పేర్కొంది.
బాధిత కుటుంబానికి సాధ్యమైనంత సహాయం అందించడానికి రష్యాలోని భారత మిషన్ సంబంధిత అధికారులను సంప్రదించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. “సముద్రయాన భద్రత, సురక్షితత్వం, ప్రపంచ వాణిజ్యం నిరంతరాయంగా సాగేలా చూసేందుకు అంతర్జాతీయ బాధ్యతలను నిలబెట్టాలని సంబంధిత పక్షాలన్నింటికీ భారతదేశం పిలుపునిస్తోంది,” అని మంత్రిత్వ శాఖ జోడించింది.
జూలై 19న ఉక్రేనియన్ ఓడరేవు నుండి బయలుదేరిన కొద్దిసేపటికే గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవి గోల్డెన్ లియో అనే సరుకు రవాణా నౌకపై దాడి జరిగిన ఇలాంటి ఘటనే తర్వాత ఈ దాడి వార్త వెలువడింది. ఆ దాడిలో నలుగురు భారతీయ సిబ్బంది మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.
మరోవంక, ఇరాన్ జలాల్లో దాడికి గురైన మొజాంబిక్ జెండాతో ఉన్న ఎల్పీజీ ట్యాంకర్ ‘దిశ’లోని 28 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. దాడి ఘటనను ధ్రువీకరించిన ఎంబసీ సిబ్బంది భద్రత కోసం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తాజా పరిస్థితులను అధికారులు నిశితంగా గమనిస్తున్నారని వెల్లడించింది. అయితే దాడికి గల కారణాలు, నౌక ప్రస్తుత పరిస్థితిపై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

More Stories
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దిన్ రాజీనామా
కామన్వెల్త్ క్రీడల ప్రారంభంకు ముందే భారత్ కు తొలి పతకం
వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ రెబెల్స్ దాడులు