కాంగ్రెస్‌ ద్రోహాన్ని మరువం.. ఇండియా కూటమిలో చేరం

కాంగ్రెస్‌ ద్రోహాన్ని మరువం.. ఇండియా కూటమిలో చేరం

ఇండియా కూటమిలో విభేదాలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా వీసీకే పార్టీ చీఫ్‌ తోల్‌ తిరుమావళవన్‌ తమిళనాడులో విజయ్‌ నేతృత్వంలోని అధికార టీవీకే, విపక్ష డీఎంకే పార్టీలను జాతీయ ప్రతిపక్ష కూటమి లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్‌తో డీఎంకే తెగదెంపులు చేసుకున్న క్రమంలో రెండు పార్టీల మధ్యన సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నారు. 

కేరళ, పశ్చిమ బెంగాల్‌ల మాదిరి రాజీ ఏర్పాటును ఆయన ఈ సందర్భంగా ప్రతిపాదించారు. అక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కూటమి పార్టీలు శత్రువులుగా ఉన్నప్పటికీ కేంద్రం స్థాయిలో ఇండియా కూటమిలో మాత్రం మిత్రపక్షాలుగా ఉంటున్నాయి. అక్కడ మాదిరిగానే తమిళనాడులో కూడా అధికార (టీవీకే, కాంగ్రెస్‌)-విపక్ష డీఎంకేలు కొనసాగించవచ్చునని సూచించారు. 

ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపింది. రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి రాజకీయాలు వేరువేరని, కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే కూటమి పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అయితే ఈ సూచనను డీఎంకే నిర్దంద్వంగా తిరస్కరించింది ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తీవ్ర ద్రోహానికి పాల్పడిందని, దానిని మరువలేమని పేర్కొంటూ, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల మధ్య అలాంటి విధానంలో పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

దీనిపై డీఎంకే ఎంపీ గణపతి పీ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ కేవలం ఒకటి రెండు మంత్రి పదవుల కోసం అధికారంలోని టీవీకేతో చేతులు కలపడం ద్వారా తమను కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.  తాత్కాలిక ప్రయోజనాల కోసమే ఆ పార్టీ పాకులాడింది తప్ప ఇండియా కూటమి దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించ లేదని, ఇప్పుడు చేసిందంతా చేసి వీసీకేను దూతలా ప్రయోగించి డీఎంకేను దువ్వడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

‘వీసీకే చేసే ప్రతిపాదనను డీఎంకే అంగీకరిస్తుందని నేను భావించడం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్‌ మోడల్‌ తమిళనాడులో పనిచేయదు’ అని ఆయన స్పష్టం చేశారు. డీఎంకే-కాంగ్రెస్‌ మధ్య ఏర్పడిన విభేదాలు ఇంకా పరిష్కారం కాలేదని, ఒక వేళ వాటిని పునరుద్ధరించుకోవాలని భావించినా దానికి చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు.