భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన చబహార్‌ పోర్టుపై అమెరికా దాడి

భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన చబహార్‌ పోర్టుపై అమెరికా దాడి
అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రకటించడంతో ఇరు దేశాల మధ్ వరుసగా రెండో రోజు కూడా దాడులు కొనసాగాయి. ఈ క్రమంలోనే భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన చబహార్‌ పోర్టుపై తాజాగా అమెరికా వైమానిక దాడులు ప్రారంభించింది.
చబహార్ అంతటా పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు రాగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.  ఈ దాడుల్లో కలంతారి పోర్టు, మారిటైమ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌ ధ్వంసమైనట్లు తెలిపింది. దెబ్బతిన్న ప్రదేశాలకు అత్యవసర సేవల సిబ్బంది హుటాహుటిన చేరుకుంటుండగా, తాము అనేక పేలుళ్ల శబ్దాలు విన్నామని స్థానికులు తెలిపారు.
ఏప్రిల్‌లో అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ ఓడరేవుపై  జరిగిన మొదటి దాడి ఇదే. హిందూ మహా సముద్రం నుంచి ఇరాన్‌ సముద్ర వాణిజ్యానికి అవసరమైన డీప్‌ వాటర్‌ పోర్టు ఇక్కడ ఉంది. టెహ్రాన్‌కు ఇది ఆర్థికంగా కీలక ప్రాంతం. భారత్‌ నిధులతో ఈ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు.  ఇక్కడి నుంచి అఫ్గానిస్థాన్‌, మధ్య ఆసియాకు సరకులు రవాణా చేయాలని భారత్‌ భావిస్తోంది.

‘హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరిచేందుకు సెంట్రల్ కమాండ్ వారిపై అదనపు దాడులు ప్రారంభించింది’’ ఎక్స్ (ట్విట్టర్)లో సెంట్రల్ కమాండ్ పోస్ట్ చేసింది. ‘‘కీలకమైన అంతర్జాతీయ జలమార్గంలో స్వేచ్ఛగా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై ఇటీవల జరిగిన దురాక్రమణకు ఇరాన్‌ను అమెరికా బాధ్యరాలిని చేస్తోంది’’ అని పేర్కొంది.

పౌర ఓడరేవులు, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలు మినహా వాణిజ్య పోర్టులు, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, సమీపంలోని సైనిక ఆస్తులపై జరిగాయని ప్రాథమిక నివేదికలు తెలిపాయి. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు సరుకు రవాణా నౌకలపై మంగళవారం జరిగిన దాడికి ఇరాన్ కారణమని వాషింగ్టన్ ఆరోపించింది. ఆ దాడులను అనుసరించి ఇరాన్‌పై అమెరికా ప్రతీకారానికి పూనుకుంది.

హర్మూజ్‌లను వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తే, దాడులు ‘మరింత తీవ్రమవుతాయని’ టెహ్రాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. అటు, ఇరాన్ కూడా అమెరికాపై ప్రతీకార దాడులు చేసింది. పశ్చిమాసియాలోని దాని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. 
 
తాజా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు విఘాతంగా పరిణమించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతోన్న వేళ అమెరికా దాడులు ప్రారంభించడం గమనార్హం.