భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం ఎగుమతులు

భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం ఎగుమతులు
భారత్‌, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఇంధన భద్రతకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వ‌ల్ల‌ ఆస్ట్రేలియా నుంచి శాంతియుత అవసరాల కోసం భారత్‌కు యురేనియం ఎగుమతులకు మార్గం సుగమమైంది. ఇంధన రంగంలో రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అడుగుగా దీనిని భావిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో జరిగిన వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అణుశక్తి రంగంలో కీలక ఒప్పందం కుదిరిందని, దీనివల్ల ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు యురేనియం సరఫరాకు మార్గం ఏర్పడుతుందని మోదీ తెలిపారు. ఇది దేశ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు కొత్త ఊతం ఇస్తుందని చెప్పారు.
రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇంధన వాణిజ్యం, సరఫరా వ్యవస్థ బలోపేతం, స్వచ్ఛ ఇంధన వినియోగం పెంపుపై కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. 2015లో కుదిరిన అణు సహకార ఒప్పందం కింద యురేనియం ఎగుమతులకు అవసరమైన పరిపాలనా ప్రక్రియలను కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి.

ఆస్ట్రేలియా నుంచి వచ్చే యురేనియం పూర్తిగా శాంతియుత అవసరాలకే వినియోగిస్తామని స్పష్టం చేశాయి. దీనిపై ‘ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ’ భద్రతా నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా, ధరలపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశాయి. అయినా ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు కొనసాగిస్తామని వెల్లడించాయి.

ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో ఆస్ట్రేలియా, ద్రవ ఇంధనాలు, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో భారత్‌ కీలక భాగస్వాములని రెండు దేశాలు గుర్తించాయి. పునరుత్పాదక ఇంధనం, తక్కువ కాలుష్య ఇంధనాలు, పెట్టుబడులు, ప్రాంతీయ సహకారాన్ని మరింత పెంచాలని నిర్ణయించాయి. బొగ్గు, డీజిల్‌, సహజ వాయువు వంటి ఇంధనాల సరఫరా స్థిరంగా కొనసాగేలా కలిసి పనిచేస్తామని స్పష్టంచేశాయి. భారత్‌ ప్రారంభించిన గ్లోబల్‌ బయోఫ్యూయెల్స్‌ అలయన్స్‌ కార్యక్రమాన్ని కూడా ఆస్ట్రేలియా స్వాగతించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభాన్ని, సరఫరా గొలుసు అంతరాయాలను అధిగమించడానికి భారతదేశం, ఆస్ట్రేలియా దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతకు ముందు స్పష్టం చేశారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ‘ఇండో-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరమ్’ సదస్సులో ఆయన ఇరు దేశాల వ్యాపార ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. 

భారతదేశం తన ఇంధన అవసరాల కోసం పర్యావరణహిత వ్యూహాలను వేగంగా అమలు చేస్తోందని, అందులో భాగంగానే స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యేనాటికి, అంటే 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మోదీ వెల్లడించారు. ఈ అణు ఇంధన ప్రయాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం నిల్వలు కలిగిన ఆస్ట్రేలియా సహకారం భారత్‌కు ఎంతో అనుకూలంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కేవలం ఇంధన రంగమే కాకుండా, భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలియా కంపెనీలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని రేవు పట్టణాలు, విమానాశ్రయాలు, రోడ్డు మార్గాలు, రైల్వేలు మరియు పట్టణ మౌలిక వసతుల కల్పనలో అంతర్జాతీయ పెట్టుబడుల కోసం భారత్ అనువైన సంస్కరణలను తీసుకువచ్చిందని ఆయన గుర్తుచేశారు. 

ఆస్ట్రేలియాకు చెందిన అధునాతన సాంకేతికత, భారీ మూలధనం భారతదేశపు వేగవంతమైన ఆర్థిక ప్రగతికి తోడైతే ఇరు దేశాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఈ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా పాల్గొని ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతాన్ని స్వాగతించారు.