ఆధునిక డ్రోన్ల నిఘాను ఎదుర్కొనేందుకు ‘ఆకాశ్ తరంగ్’

ఆధునిక డ్రోన్ల నిఘాను ఎదుర్కొనేందుకు ‘ఆకాశ్ తరంగ్’
ఆర్మీ, నౌకాదళం, వాయుసేన అవసరాల కోసం అత్యంత అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ఆమోదాల ద్వారా చేకూర్చనున్నారు. ముఖ్యంగా యాంటీ డ్రోన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, క్షిపణి వ్యవస్థల వంటి అత్యాధునిక సదుపాయాలను సమకూర్చుకోవడంపై రక్షణ కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇది సరిహద్దు భద్రతను మరింత సురక్షితం చేయనుంది.  
 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశంలో రూ.52,000 కోట్ల అంచనా వ్యయంతో వివిధ కొనుగోలు ప్రతిపాదనలకు పరిపాలనా ఆమోదం లభించింది. శత్రువుల ఆధునిక డ్రోన్ల నిఘాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ‘ఆకాశ్ తరంగ్’ యాంటీ-యూఏవీ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌ను సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు. 
 
సాయుధ వాహనాల ముప్పును తిప్పికొట్టడానికి పదాతి దళ సామర్థ్యాన్ని పెంపొందించే ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్’ వ్యవస్థలు సహాయపడతాయి. వైమానిక ముప్పుల నుంచి రక్షణ కల్పించేందుకు సహాయపడే మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ ఆయుధ వ్యవస్థకు కూడా ఆమోదం లభించింది. 
 
సైన్యం ఉపయోగించే అత్యాధునిక యుద్ధ ట్యాంకుల ప్రాణనష్టాన్ని నివారించడానికి, వాటి మనుగడను పెంచడానికి ‘యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్’ సిస్టమ్ కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యంత సున్నిత, సంక్లిష్ట వాతావరణంలో పనిచేసే మల్టీ స్పెక్ట్రల్ సెన్సింగ్ కలిగిన వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రక్షణ కవచంలా పని చేస్తుంది. తక్కువ ఖర్చుతో, అధిక వినాశకర శక్తి ఉన్న జెట్ ఆధారిత కమికాజే డ్రోన్ వ్యవస్థను కూడా సైన్యం సొంతం చేసుకోనుంది.

నేవీని బలోపేతం కోసం రక్షణ కొనుగోళ్ల మండలి కీలక కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శత్రు నౌకల కదలికలను నిరోధించేందుకు మల్టీ ఇన్‌ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ ఆర్మీ అమ్ములపొదిలో చేరనుంది. సముద్ర జలాల్లో నిరంతర నిఘా కోసం నావల్ షిప్‌బోర్న్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. నౌకల ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ మోటార్లను సురక్షితంగా పరీక్షించడానికి ల్యాండ్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. 

 
వైమానిక దళానికి కీలకమైన ‘ఫిక్స్డ్ వింగ్ బేస్డ్ హై ఆల్టిట్యూడ్ స్యూడో శాటిలైట్’ కొనుగోలుకు డీఏసీ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఎయిర్‌ఫోర్స్ సుదూర ప్రాంతాలలో నిరంతర పర్యవేక్షణ, శత్రు గూఢచర్యాన్ని పసిగట్టే సమాచారం సేకరించడం, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీ, రిమోట్ సెన్సింగ్‌ను సమర్థవంతంగా చేపట్టగలదు. సరిహద్దుల్లో మారుతున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సరికొత్త ఆయుధ సంపత్తి రక్షణ బలగాల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.