సీఎం విజయ్‌, త్రిషలపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్‌

సీఎం విజయ్‌, త్రిషలపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్‌
టీవీకే అధినేత, ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌, సినీ నటి త్రిషలపై ఓ బహిరంగ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్ ను తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక టీవీకే కార్యకర్తలు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం, ఘర్షణను ప్రేరేపించడం వంటి ఆరోపణలపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 
 
హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించిన వెంటనే పోలీసులు రాధాకృష్ణన్‌ను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి ఉత్సవాల సందర్భంగా జూన్ 20న తిరుచెందూర్ సమీపంలోని ఆత్తూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాధాకృష్ణన్ ముఖ్యమంత్రిని విమర్శిస్తూ తీవ్రమైన వ్యక్తిగతంగా దూషిండమే కాకుండా ఎగతాళి వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగించారు. 
 
విజయ్ రూపాన్ని, అలాగే ఆయన సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి మారడాన్ని ఎగతాళి చేస్తూ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శాంతిభద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో నటితో సంతోషంగా ఉండే విజయ్‌ ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుపోయి నలువైపులా ఇరుక్కుపోయాననే మానసిక ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్‌లు వేరు రాష్ట్ర పాలన వేరని అంటూ ఎద్దేవా చేశారు. 

అక్కడితో ఆగకుండా `నేను ఒక వ్యాపారిని. ఒక వ్యక్తి దుకాణంలోకి వచ్చినప్పుడు అతను కొనడానికి వచ్చాడా? లేక అప్పు తీసుకోవడానికి వచ్చాడా? అనేది నేను వారి ముఖం చూసి చెప్పగలను” అని రాధాకృష్ణన్‌ తెలిపారు. అదేవిధంగాఅదేవిధంగా అసెంబ్లీలో సీఎం విజయ్‌ ముఖంలో కనిపిస్తున్న గందరగోళాన్ని చూస్తే అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాను. తనకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అన్నట్లుగా తన ప్రవర్తన కనిపించిందని వ్యంగ్యంగా పేర్కొన్నారు. 

కాగా, ఎమ్మెల్యే అరెస్ట్‌పై డీఎంకే మండి పడింది. ప్రతిపక్షంపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేత వ్యూహాలను ఉపయోగిస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. ఈ చర్యను నిరంకుశ ప్రభుత్వంపై ఎక్స్ వేదిగా విమర్శలు గుప్పిస్తూ డీఎంకే ఇటువంటి అణచివేత వ్యూహాలకు ఎప్పటికీ తలొగ్గదనిని ఆమె స్పష్టం చేశారు.

ఒక శాసన సభ్యుడు ఇలా వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదంటూ మద్రాసు హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1967 నుంచి తమిళనాడులో సినీరంగం నుంచి వచ్చిన అనేక మంది నాయకులను ప్రజలు ఎన్నుకున్నారని, అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధి ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దాంతో పోలీసులు రాధాకృష్ణన్‌ను అరెస్టు చేశారు.