11న ట్రస్ట్ సమావేశం ముందుకు చంపత్ రాయ్ రాజీనామా

11న ట్రస్ట్ సమావేశం ముందుకు చంపత్ రాయ్ రాజీనామా

* వెండి ఇటుకలు, ఆభరణాలు తదితర విలువైన కానుకలు భద్రం.. ట్రస్ట్ భరోసా 

రామ మందిరానికి విరాళంగా వచ్చిన నిధులు, విలువైన వస్తువుల దొంగతనం, దుర్వినియోగం ఆరోపణలపై అయోధ్య పోలీసులు దర్యాప్తును విస్తృతం చేస్తూ, స్వాధీనాలు ప్రారంభించగా, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామా లేఖలు తమకు అందినట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం ప్రకటించింది. రాజీనామా లేఖలపై తమ తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ట్రస్ట్ తెలిపింది. 

మందిర విరాళాల దొంగతనం ఆరోపణలపై అరెస్టు అయిన ఎనిమిది మందిలో రాయ్ మాజీ డ్రైవర్ రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిను యాదవ్ కూడా ఒకరు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఈ అరెస్టు అయిన వారిని సోమవారం అవినీతి నిరోధక చట్టం కోర్టులో హాజరు పరుస్తారు. ఎనిమిది మంది నిందితులలో ఏడుగురి నుంచి పోలీసులు ఇప్పటివరకు రూ. 79.80 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

ట్రస్ట్ తరపున ఎక్స్ లో ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి ఓ ప్రకటనలో, “శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం (ట్రస్ట్) ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల నుంచి ట్రస్ట్‌కు రాజీనామా లేఖలు అందాయి. ట్రస్ట్ తన రాబోయే సమావేశంలో వీటిని పరిశీలిస్తుంది,” అని ప్రకటించారు. 

“గత కొన్ని రోజులుగా శ్రీరామ ఆలయం (అయోధ్య)లో జరిగిన సంఘటనల గురించి విని మేము దిగ్భ్రాంతికి, బాధకు, తీవ్ర దుఃఖానికి గురయ్యాము. ఇక్కడ రామభక్తులు, రామసేవకులందరి ప్రతినిధులుగా సేవలందిస్తున్న మేము, నిష్పక్షపాత విచారణ జరిగేలా చూస్తామని, రామభక్తులకు హామీ ఇస్తున్నామని కట్టుబడి ఉన్నాము,” అని ఆయన హామీ ఇచ్చారు.

 “శ్రీరామునికి కానుకలుగా వెండి ఇటుకలు, ఆభరణాలు, ఇతర వస్తువులను ట్రస్ట్ అధికారులకు వ్యక్తిగతంగా అందజేసిన భక్తుల వద్ద అవి సరైన రికార్డులతో భద్రంగా ఉన్నాయని ట్రస్ట్ హామీ ఇస్తోంది. ఆలయంలోని విరాళాల పెట్టెల ద్వారా అందిన డబ్బుకు సంబంధించి, ట్రస్ట్ అభ్యర్థన మేరకు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా ట్రస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

భక్తుల కానుకల నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈ వ్యవహారం విస్తృత దృష్టిని ఆకర్షించింది. తమ తదుపరి సమావేశం జూలై 11న జరుగుతుందని కూడా ట్రస్ట్ ప్రకటించింది.  సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నప్పటికీ, రాబోయే సమావేశంలో ప్రస్తుత సంక్షోభం, దర్యాప్తు జరుగుతున్న ఆరోపణలపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది.  
 
అంతర్గత విచారణ, జవాబుదారీతనం పెంపొందించే చర్యలు, పరిపాలనాపరమైన పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశంలో బోర్డు ముందు ఉంచవచ్చని సమాచారం.  చంపత్ రాయ్ స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శి నియామకం, అలాగే డాక్టర్ అనిల్ మిశ్రా స్థానంలో మరొకరిని నియమించడంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.  రామమందిర ప్రాంగణం కోసం కొత్త సీఈఓ నియామకంపై కూడా పరిశీలన జరగవచ్చని సమాచారం తెలుస్తోంది. 

“భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి మళ్లీ తలెత్తదని మేము అందరికీ హామీ ఇస్తున్నాము. నిందితులు అత్యంత కఠినమైన చట్టపరమైన శిక్షను ఎదుర్కొనేలా మేము పట్టుబడతాము. సనాతన ధర్మాన్ని అప్రతిష్టపాలు చేసే వారి ప్రయత్నాలలో సంఘ వ్యతిరేక, మతవిశ్వాసం లేని,యు స్వార్థ శక్తులను మేము విజయం సాధించనివ్వము,” అని ఆ ప్రకటనలో  స్వామి గోవింద్ గిరి  స్పష్టం చేశారు. 

“ఈ మేఘాలు తొలగిపోతాయని, చీకటి అదృశ్యమవుతుందని, సూర్యుని సత్య కాంతి ప్రకాశిస్తుందని, రామభక్తి అనే శక్తివంతమైన ప్రవాహం నిరంతరాయంగా సాగుతూనే ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము” అని ట్రస్ట్ పేర్కొంది. 2020లో ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత, ఆలయ నిర్వహణలో చంపత్ రాయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన నిర్మాణ కమిటీ, నిర్మాణ సంస్థతో సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. 

రామమందిర నిర్వహణలో ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా చురుకుగా పాల్గొన్నారు. జనవరి 2024లో జరిగిన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన, ఆయన భార్య ‘ప్రధాన యజమానుల’గా (ప్రధాన నిర్వాహకులుగా) పూజా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత  జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.