ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ (73) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. దాదాపు ఐదు దశాబ్దాలపాటు తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఆయన మరణ వార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, కె. భాగ్యరాజ్కు శుక్రవారం రాత్రి అస్వస్థతకి లోనయ్యారు.
అనంతరం ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలబెట్టలేకపోయినట్లు సమాచారం. కె. భాగ్యరాజ్ తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రత్యేకమైన రచయిత-దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కుటుంబ కథలు, ప్రేమ, హాస్యం, సామాజిక అంశాలను సమతుల్యంగా మిళితం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉండేది.
ఆయన సినిమాల్లో కనిపించే మధ్యతరగతి కుటుంబాల కథలు, సహజమైన పాత్రలు, చమత్కారమైన సంభాషణలు, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయి. సాధారణ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను కూడా ఆసక్తికరమైన కథలుగా మలచడంలో ఆయన దిట్ట. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ కె. భాగ్యరాజ్ మంచి గుర్తింపు సంపాదించారు.
ఆయన పోషించిన పాత్రలు సాధారణ మనుషుల జీవితాలకు దగ్గరగా ఉండేవి. లోపాలు ఉన్నప్పటికీ మనసుకు దగ్గరగా అనిపించే పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. 1979లో విడుదలైన ‘సువరిల్లాధ చిత్రంగళ్’ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన భాగ్యరాజ్, తొలి సినిమాతోనే తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు.
భాగ్యరాజ్కి భార్య మాజీ నటి పూర్ణిమ జయరామ్, కుమార్తె శరణ్య భాగ్యరాజ్, కుమారుడు, నటుడు శాంతను భాగ్యరాజ్ ఉన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయనను ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ప్లే’గా సినీ వర్గాలు, అభిమానులు కొనియాడేవారు. భాగ్యరాజ్ కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడు, కథా రచయిత, సంగీత దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 75 చిత్రాల్లో నటించి, 25 సినిమాలకు దర్శకత్వం వహించారు.
1983లో విడుదలైన ‘ముందనై ముడిచ్చు’ (తెలుగులో మూడు ముళ్లు) చిత్రం ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం కూడా లభించింది.

More Stories
వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
సేవ, ఐక్యత, జాతీయ చైతన్యంలను బలోపేతం చేసిన ఆర్ఎస్ఎస్
పంజాబ్ లో ఆప్ నేతృత్వంలో అత్యంత అవినీతి ప్రభుత్వం