ఐబీ చీఫ్‌గా తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి

ఐబీ చీఫ్‌గా తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి
ఇంటెలిజెన్స్ బ్యూరీ డైరెక్ట‌ర్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి మ‌హేశ్ దీక్షిత్‌ ను కేంద్రం నియ‌మించింది. ఇంటెలిజెన్స్ రంగంలో ఆయ‌న‌కు విశేష అనుభ‌వం ఉన్న‌ది. 1993 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్. ప్ర‌స్తుతం ఐబీ డైరెక్ట‌ర్‌గా ఉన్న త‌ప‌న్ కుమార్ డేకా స్థానంలో మ‌హేశ్ దీక్షిత్ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించ‌నున్నారు. రెండేళ్ల పాటు ఆయ‌న ఐబీ చీఫ్‌గా కొన‌సాగుతారు. 
 
అపాయింట్‌మెంట్స్ క్యాబినెట్ క‌మిటీ ఆమోదం ప్ర‌కారం మ‌హేశ్ దీక్షిత్‌ను నియ‌మించారు. ప్ర‌స్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆయ‌న స్పెష‌ల్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఉన్న‌త పోస్టును స్వీక‌రించే రీతిలో ఆయ‌న స‌ర్వీస్‌ను పొడిగించారు. ఐబీలో అంతర్గత భద్రతా కార్యకలాపాల్లో అత్యంత అనుభవజ్ఞులైన అధికారుల్లో ఒకరిగా మహేశ్ దీక్షిత్ గుర్తింపు పొందారు. మహేష్ దీక్షిత్ తెలంగాణ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. 
దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఇంటెలిజెన్స్ అధికారులలో ఒకరిగా ఆయన విస్తృతంగా గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా వైద్యుడైన దీక్షిత్, ఆ తర్వాత చట్ట అమలు (లా ఎన్‌ఫోర్స్‌మెంట్) రంగంలో తన వృత్తి జీవితాన్ని కొనసాగించారు. ఇంటెలిజెన్స్ స‌మాచార సేక‌ర‌ణ‌లో దీక్షిత్‌కు ద‌శాబ్ధాల అనుభ‌వం ఉన్న‌ది. కౌంట‌ర్ టెర్ర‌రిజం ఆప‌రేష‌న్స్‌, జాతీయ భ‌ద్ర‌త మేనేజ్మెంట్‌లోనూ ఆయ‌న సిద్ధ‌హ‌స్తుడు. ఎన్నో కీల‌క ఇంటెలిజెన్స్ ఆప‌రేష‌న్స్ చేప‌ట్టిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉన్న‌ది.
సెక్యూర్టీ వ‌ర్గాల్లో ఆయ‌న‌కు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.  జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేసిన స‌మ‌యంలో అక్క‌డ సెక్యూర్టీ ఆప‌రేష‌న్స్ అన్నీ ఆయ‌నే చూసుకున్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను నెల‌కొల్ప‌డంలో దీక్షిత్ కీల‌క పాత్ర పోషించారు. జ‌మ్మూక‌శ్మీర్ విభ‌జ‌న స‌మ‌యంలో కూడా సంక్లిష్ట‌మైన ఇంటెలిజెన్స్ బాద్య‌త‌లను ఆయ‌న‌కే అప్ప‌గించారు. 
రాజ‌కీయంగా సున్నిత‌మైన ఆ ప్ర‌దేశంలో ప్ర‌జ‌ల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఆయ‌న తీవ్రంగా శ్ర‌మించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో గుర్తింపు ఉన్న‌ది. క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు, వేర్పాటువాదుల స‌వాళ్ల‌ను ఎదుర్కొవ‌డంలో ఆయ‌న స‌మ‌య‌స్పూర్తిని ప్ర‌ద‌ర్శించారు. 

2023లో జీ20 టూరిజం వ‌ర్కింగ్ గ్రూప్ మీటింగ్ నిర్వ‌హ‌ణ‌లో దీక్షిత్ పాత్ర ఎంతో ఉంది. ఆ శిఖ‌రాగ్ర స‌ద‌స్సును శాంతియుతంగా జ‌రిగేందుకు ఆయ‌న ఎంతో శ్ర‌మ తీసుకున్నారు. ఉగ్ర‌వాదం, సైబ‌ర్ నేరాలు, సీమాంత‌ర స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా దీక్షిత్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం కీల‌క‌మైన మ‌లుపుగా భావిస్తున్నారు.