కనిష్కాలో బాంబును పేల్చింది ఖలిస్తానీయులే.. తొలిసారి కెనడా  

కనిష్కాలో బాంబును పేల్చింది ఖలిస్తానీయులే.. తొలిసారి కెనడా  
ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182లో బాంబు పేలి 329 మంది మరణించిన నాలుగు దశాబ్దాల తర్వాత, ఒట్టావా ప్రధాన గూఢచార సంస్థ అయిన కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సిఎస్ఐఎస్), ఆ పేలుడు పరికరాన్ని అమర్చింది కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులేనని చరిత్రలో మొట్టమొదటిసారిగా స్పష్టంగా ఆరోపించింది. 1985 నాటి ఈ విషాదం ఖలిస్తానీల కుట్రేనని న్యూఢిల్లీ మొదటి నుంచీ వాదిస్తున్నప్పటికీ, ఒట్టావా మాత్రం చారిత్రాత్మకంగా తన బహిరంగంగా ఆ ఉద్యమం పేరును ప్రస్తావించకుండా వచ్చింది. 
 
బుధవారం నాడు ఆ విషాదాన్ని స్మరించుకుంటూ పెట్టిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో, సిఎస్ఐఎస్ ఈ దాడికి నేరుగా ఆ వేర్పాటువాద ఉద్యమాన్నే కారణమని ఆపాదించింది. ఆ సంస్థ ఇలా పేర్కొంది, “జూన్ 23, 1985న, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాదులు అమర్చిన బాంబు విమానాన్ని ధ్వంసం చేసింది. విమానంలో ఉన్న వారందరూ మరణించారు. వారిలో ఎక్కువ మంది కెనడియన్లే. ఇది కెనడా చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడిగా,  మన జాతీయ భద్రతా విభాగానికి ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోయింది.”
 
టొరంటో నుండి ముంబైకి వెళ్తున్న ‘ఎంపరర్ కనిష్క’ అనే పేరు గల ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బోయింగ్ 747 విమానంపై జరిగిన బాంబు దాడి, కెనడా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడిగా మిగిలిపోయింది. అంతేకాకుండా, 2001లో జరిగిన సెప్టెంబర్ 11 దాడుల వరకు, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన విమానయాన ఉగ్రవాద చర్యగా నిలిచింది. 
 
నిషేధిత ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా సభ్యులు లగేజీ కంపార్ట్‌మెంట్‌లో అమర్చిన బాంబు వల్ల సంభవించిన ఈ పేలుడు, అట్లాంటిక్ మహాసముద్రంపై విమానాన్ని ముక్కలు చేసింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణీకులు, సిబ్బంది అందరూ మరణించారు. 2005లో, కెనడా ఈ విషాద వార్షికోత్సవమైన జూన్ 23ని, ఉగ్రవాద బాధితుల జాతీయ స్మరణ దినంగా అధికారికంగా ప్రకటించింది.
 
ఖలిస్తానీ తీవ్రవాదులు దేశానికి తీవ్రమైన ముప్పు అని పేర్కొంటూ సిఎస్ఐఎస్ తన వార్షిక నివేదికను విడుదల చేసిన కొద్ది నెలలకే, ఈ సంస్థ ఖలిస్తానీ ఉద్యమాన్నే స్పష్టంగా నిందించాలని నిర్ణయించింది. ఆ నివేదికలో, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాద (సిబికెఈ) గ్రూపులు తమ “హింసాత్మక తీవ్రవాద ఎజెండాను ప్రచారం చేయడానికి”, అలాగే “హింసాత్మక కార్యకలాపాలకు” నిధులు సమకూర్చి, వాటిని నిర్వహించడానికి కెనడా భూభాగాన్ని చురుకుగా వాడుకుంటున్నాయని సిఎస్ఐఎస్ హెచ్చరించింది.
 
భారతదేశంలో ఆ ఉద్యమం పూర్తిగా నీరుగారిపోయిన చాలా కాలం తర్వాత కూడా, ఒట్టావా ఖలిస్తానీ కార్యకలాపాలకు ఆశ్రయం కల్పిస్తూ, ప్రోత్సహిస్తోందన్న న్యూఢిల్లీ ఆందోళనలను కెనడా దశాబ్దాలుగా పట్టించుకోవడానికి నిరాకరిస్తూ వచ్చింది. వరుస కెనడియన్ ప్రభుత్వాలు, ముఖ్యంగా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం, ఈ విషయంలో భారతదేశంతో నిరంతరం విభేదించాయి.
 
ట్రూడో ప్రభుత్వం అయితే, కెనడియన్ పౌరులపై హింసాత్మక అంతర్జాతీయ అణచివేత ప్రచారాన్ని న్యూఢిల్లీ నడిపిస్తోందని ఆరోపించేంత వరకు వెళ్లింది. కానీ, తమ భూభాగంలో చాలా కాలంగా పనిచేయడానికి అనుమతించిన ఖలిస్తానీ నెట్‌వర్క్‌ల వల్ల కలిగే ముప్పును కెనడియన్ ఏజెన్సీలు ఎట్టకేలకు గుర్తించడంతో, భారతదేశ వైఖరి చివరికి సరైనదని స్పష్టమైన్నట్లు  కనిపిస్తోంది. 
 
కెనడాకు ఇంత సమయం ఎందుకు పట్టింది?
 
ఎయిర్ ఇండియా బాంబు దాడిలో ఖలిస్తానీల ప్రమేయాన్ని కెనడా ఇటీవల అంగీకరించడం భారతదేశానికి ఎందుకు ముఖ్యమో పరిశీలించే ముందు, ఈ నిర్ణయానికి రావడానికి ఒట్టావాకు నాలుగు దశాబ్దాలకు పైగా ఎందుకు పట్టిందో ప్రశ్నించుకోవడం చాలా కీలకం. ఈ జాప్యానికి ప్రధాన కారణం కెనడా భద్రతా యంత్రాంగంలోని ఒక ఘోరమైన వైఫల్యం. 
 
మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాన్ మేజర్ నేతృత్వంలో 2010లో జరిగిన ఒక ప్రజా విచారణ, జాతీయ ఏజెన్సీల ద్వారా “వరుసగా తప్పులు” జరిగాయని, అవి ఈ కేసును తీవ్రంగా బలహీనపరిచాయని తేల్చింది. అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే, సీఎస్ఐఎస్, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్ సిఎంపీ)ల మధ్య జరిగిన తీవ్రమైన ఆధిపత్య పోరు దర్యాప్తును స్తంభింపజేసింది. 
 
సిఎస్ఐఎస్ బబ్బర్ ఖల్సా నాయకుడు తల్విందర్ సింగ్ పర్మార్‌ను చురుకుగా పర్యవేక్షించినప్పటికీ, ఆ సంస్థ వందలాది గంటల కీలకమైన వైర్‌టాప్ రికార్డింగ్‌లను ధ్వంసం చేసింది. తద్వారా త్వరితగతిన నేరారోపణలు రుజువు చేయడానికి ఉపయోగపడే సాక్ష్యాలను తుడిచిపెట్టింది. ఈ నిఘా వైఫల్యానికి తోడు, సంస్థాగతమైన తీవ్రమైన ఉదాసీనత కూడా తోడైంది. 
 
329 మంది బాధితులలో 268 మంది కెనడియన్ పౌరులు అయినప్పటికీ, ఈ దాడిని రాజకీయ నాయకులు, ప్రజలు ఒక సుదూర “భారతీయ” సమస్యగా కొట్టిపారేశారు. ఈ వ్యవస్థాగత పక్షపాతం దర్యాప్తు రాజకీయ ప్రాధాన్యతను తొలగించింది. ఈ వైఫల్యాన్ని 2010లో ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్ అంగీకరించారు. బాధితుల కుటుంబాల పట్ల సంస్థాగత ఉదాసీనత ప్రదర్శించిన్నట్లు ఆయన పేర్కొన్నారు. 
 
చట్టపరమైన అడ్డంకులు జవాబుదారీతనాన్ని మరింత ఆలస్యం చేశాయి. కీలక సాక్షులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడంతో సహా, సాక్షులను తీవ్రంగా బెదిరించడం దశాబ్దాల పాటు దర్యాప్తు అధికారులకు ఆటంకం కలిగించింది. సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ప్రధాన నిందితులు నిర్దోషులుగా విడుదలైనప్పటికీ, 2005 నాటి చారిత్రాత్మక క్రిమినల్ విచారణ కుప్పకూలడంతో, ప్రజాగ్రహం చివరకు ఒట్టావాను పూర్తిస్థాయి ప్రజా విచారణ ప్రారంభించేలా ఒత్తిడి చేసింది. 
 
కెనడా సంస్థాగత వైఫల్యాలకు 2010లో ప్రధాని హార్పర్ అధికారికంగా క్షమాపణ చెప్పినప్పటికీ, అధికారిక భాషను మాత్రం చాలా జాగ్రత్తగా గోప్యంగా ఉంచారు. సంవత్సరాల తరబడి, ప్రభుత్వ పత్రాలు “తిరుగుబాటుదారులు” లేదా “పేరులేని తీవ్రవాదులు” వంటి అస్పష్టమైన మృదువైన పదజాలంపై ఆధారపడ్డాయి. కెనడాలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద చర్యకు “కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాదులే” సూత్రధారులని స్పష్టంగా పేర్కొంటూ, ఆ అస్పష్టతను తొలగించడానికి ఒట్టావాకు మరో 16 ఏళ్లు పట్టింది.
 
భారతదేశానికి కెనడా గుర్తింపు ఎందుకు ముఖ్యం?
 
1970వ దశకంలో పంజాబ్‌లో ప్రారంభమైన ఖలిస్తానీ ఉద్యమం, దశాబ్దాల పాటు రక్తపాత తిరుగుబాటులో పాల్గొన్న తర్వాత, భారతదేశంలో చాలా కాలం క్రితమే ప్రాముఖ్యత కోల్పోయింది. అయినప్పటికీ, ఈ ఉద్యమం నిజంగా ఎన్నడూ అంతరించిపోలేదు. ఎందుకంటే, భారత చట్ట అమలు సంస్థల నుండి తప్పించుకోవడానికి, సంవత్సరాలుగా చాలా మంది నిబద్ధత కలిగిన ఖలిస్తానీలు పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా కెనడాకు పారిపోయారు.
 
కెనడాలో, ఈ పలాయనం చేసిన ఖలిస్తానీలు తమ మూలాలను విస్తరించుకోవడానికి ఒక సురక్షితమైన ఆశ్రయాన్ని, సారవంతమైన భూమిని కనుగొన్నారు. ఈ పెరుగుదలకు కొన్ని ప్రత్యేకమైన కారణాల కలయిక దోహదపడింది: ఒకటి, వారి కథనాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద, అత్యంత కేంద్రీకృతమైన ప్రవాస సమాజం; రెండు, “భావ ప్రకటనా స్వేచ్ఛ”ను పరిరక్షించే నెపంతో వారి కార్యకలాపాలను నిరంతరం కాపాడుతూ, ఇటీవలి వరకు వారి కార్యకలాపాలలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన కెనడా ప్రభుత్వం.
 
తమ గడ్డపై పనిచేస్తున్న ఖలిస్తానీ సమూహాలకు కెనడా అందించిన ఈ మద్దతు, దశాబ్దాలుగా ఒట్టావా, న్యూఢిల్లీ మధ్య సంబంధాలలో ఒక పెద్ద అడ్డంకిగా నిరూపించబడింది. భారతదేశంలో “హత్యలు, మానవ అక్రమ రవాణా,  వ్యవస్థీకృత నేరాలతో సహా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు” ఖలిస్తానీ కార్యకర్తలు మద్దతు ఇస్తుంటే, కెనడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని భారతదేశం తరచుగా ఆరోపిస్తూ వస్తుంది. 
 
భారత ప్రభుత్వం ప్రకారం, ఈ నేరాల ద్వారా వచ్చే ఆదాయం, ఒక మతపరమైన రాజకీయ ఉద్యమం పేరుతో జరుగుతున్న ఉగ్రవాద ప్రచారాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. దీనిని భారత అధికారులు ఉగ్రవాదంగా అభివర్ణిస్తున్నారు. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పరిపాలనలో ఈ ఉద్రిక్తతలు చివరకు తారాస్థాయికి చేరుకున్నాయి. 
 
2018లో ట్రూడో భారతదేశంలో జరిపిన గందరగోళ పర్యటన సందర్భంగా ఒక తొలి ఘర్షణ చోటుచేసుకుంది. 1986లో పంజాబీ మంత్రి మల్కియత్ సింగ్ సిధుపై జరిగిన హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన సిక్కు కెనడియన్ అయిన జస్పాల్ అత్వాల్‌ను, ఆయన ప్రతినిధి బృందం పొరపాటున ఒక అధికారిక విందుకు ఆహ్వానించింది. 
కెనడా గడ్డపై ఖలిస్తానీ కార్యకర్త హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను భారత గూఢచార సంస్థలు, ముఖ్యంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ప్లాన్ చేశాయని ట్రూడో కెనడా పార్లమెంటులో నిలబడి ఆరోపించడంతో ఈ దౌత్యపరమైన పరిణామాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇది ఇరు దేశాల మధ్య అపూర్వమైన ప్రతిష్టంభనకు దారితీసింది. 
 
అయితే, మార్క్ కార్నీ ప్రభుత్వం చివరకు ఖలిస్తాన్ ఉద్యమం పట్ల కెనడా ప్రభుత్వ దృక్పథంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సంవత్సరం మార్చిలో ప్రచురించిన తన 2025 బహిరంగ నివేదికలో, ఒట్టావా ప్రధాన నిఘా సంస్థ సీఎస్ఐఎస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా “కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాద (సీబీకేఈ) సమూహాల” ఉనికిని జాతీయ భద్రతా ముప్పుగా గుర్తించింది.
 
 “సీబీకేఈలు హింసాత్మక తీవ్రవాద కార్యకలాపాలలో నిరంతరం పాల్గొనడం కెనడాకు, కెనడియన్ ప్రయోజనాలకు జాతీయ భద్రతా ముప్పును కలిగిస్తూనే ఉంది” అని నివేదిక పేర్కొంది. ఇంకా తీవ్రమైన విషయం ఏమిటంటే, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీలు తమ స్వప్రయోజనాల కోసం కెనడియన్ సంస్థలను చురుకుగా వాడుకుంటున్నారని సీఎస్ఐఎస్ అంగీకరించింది.
 
 “కొన్ని సీబీకెఈలకు కెనడియన్ పౌరులతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారు తమ హింసాత్మక తీవ్రవాద ఎజెండాను ప్రచారం చేయడానికి, అమాయక సమాజ సభ్యుల నుండి నిధులను సేకరించి, వాటిని హింసాత్మక కార్యకలాపాల వైపు మళ్లించడానికి కెనడియన్ సంస్థలను ఉపయోగించుకుంటున్నారు” అని నివేదిక పేర్కొంది. బుధవారం, కెనడా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఉగ్రదాడి వెనుక ఖలిస్తానీల పాత్రను సీఎస్ఐఎస్ అధికారికంగా అంగీకరించింది. అన్ని విధాలుగా, కెనడా తన సొంత గడ్డపై హింసాత్మక తీవ్రవాద గ్రూపులకు గుడ్డిగా ఆశ్రయం కల్పించిందన్న భారతదేశపు దీర్ఘకాలిక వైఖరికి ఇది ఒక సమర్థన.