భూమి కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్

భూమి కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్

వైసీపీ నేత, వినుకొండ మాజీ ఎమ్యెల్యే బోళ్ల బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ నగర శివారు గండిపేటలో ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు నకిలీ జీవోలను తయారు చేసి, వాటిని నెట్టింట వైరల్ చేసిన కేసులో బొల్లా బ్రహ్మనాయుడు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

రూ.వేల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి విక్రయించేందుకు బొల్లా బ్రహ్మనాయుడు సహా పలువురు నిందితులు ప్రయత్నాలు చేయగా, గండిపేట తహసీల్దారు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న బ్రహ్మనాయుడును తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

గండిపేటలో ఉన్న 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ కుట్ర జరిగినట్లు సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.  రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లోని ప్రభుత్వ భూమి పేరు మీద ఫేక్ ప్రభుత్వ జీవోలను తయారు చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వెనుక బ్రహ్మనాయుడు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

వీటితోపాటు బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి రూ.1.25 కోట్లు బదిలీ కావడం ఈ కేసులో మరింత బలమైన ఆధారంగా మారింది.  ఈ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ప్రభుత్వ భూమిని కాజేసేందుకు చేసిన కుట్ర కేసులో బ్రహ్మనాయుడుతోపాటు మరో 8 మందిపై సైబరాబాద్ కేసులు నమోదు చేశారు. 

ఇటీవలె ఈ భూ కబ్జాకు సంబంధించి కేసు నమోదు చేసిన సైబరాబాద్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో  బ్రహ్మనాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించారు.  అయితే అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడంతోపాటు, ఇతర నిందితులు బొల్లా రమేష్, కొవ్వూరు సునీల్ సహా మరో ఇద్దరి ఆచూకీ కూడా దొరక్కపోవడంతో వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

ఈ క్రమంలోనే వారి కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసిన సైబరాబాద్ పోలీసులు మొదట హైదరాబాద్ ఆ తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు నిందితులు వెళ్లినట్లు ఆధారాలు గుర్తించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున కాంచీపురంలో బొల్లా బ్రహ్మనాయుడిని పట్టుకుని అరెస్ట్‌ చేశారు.