కాక్రోచ్ జనతా పార్టీతో ఆందోళన అనవసరం… ఆర్ఎస్ఎస్ 

కాక్రోచ్ జనతా పార్టీతో ఆందోళన అనవసరం… ఆర్ఎస్ఎస్ 
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆవిర్భావంపై ఆందోళన అవసరం లేదని, భారత ప్రజాస్వామ్యానికి అన్ని రకాల గొంతుకలకు, భావోద్వేగాలకు చోటు కల్పించే సామర్థ్యం ఉందని, ‘జెన్ జెడ్’ తరానికి దేశంపై విశ్వాసం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల్ భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు. 
భారతదేశం ప్రజాస్వామ్య ప్రక్రియలను అనుసరిస్తుందని, పారదర్శక ఎన్నికలను నిర్వహిస్తుందని, సోషల్ మీడియాతో సహా స్వేచ్ఛాయుత మీడియా వాతావరణం ఉందని తెలిపారు.
సీజేపీ దృగ్విషయంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “ప్రజాస్వామ్యంలో ఏ చర్చను, ప్రజలు కలిగి ఉండే, వ్యక్తపరిచే వివిధ అభిప్రాయాలను ఒక షాక్‌లాగా చూడకూడదని నేను భావిస్తున్నాను” అని తెలిపారు.  వాటిని సాధారణ ప్రక్రియలో భాగంగా పరిగణించాలని, వాటిని నిర్వహించడానికి మీడియాకు తగినంత స్వేచ్ఛ ఉందని తాను నమ్ముతున్నానని చెప్పారు.
రాజకీయ పార్టీలు ఉన్నాయని, సమర్థవంతంగా కూడా ఉన్నాయని పేర్కొంటూ మన సంస్థలలో ఏదీ బలహీనంగా లేదని ఆయన స్పష్టం చేశారు. “మన ప్రజల శక్తి, మన ప్రజాస్వామ్యం బలంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి గొంతుకను, భావోద్వేగాన్ని కలుపుకునే సామర్థ్యం మన ప్రజాస్వామ్యానికి ఉందని నేను నమ్ముతున్నాను. ప్రజలు దానిని విశ్వసించాలి. ఆర్‌ఎస్‌ఎస్‌కు దానిపై పూర్తి విశ్వాసం ఉంది” అని చెప్పారు. 
 
భారతదేశ యువత, లేదా “జెన్ జెడ్” దేశం పట్ల ఆశావాదంతో ఉన్నారని, రాజ్యాంగ చట్రంలోనే పనిచేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “భారతదేశ యువత లేదా ‘జెన్ జెడ్’ చాలా ఆశావాదంతో ఉన్నారు. దేశంపై గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు. వారు రాజ్యాంగ చట్రంలోనే పనిచేస్తారు,” అని ఆయన పేర్కొన్నారు.  “ప్రజాస్వామ్యంలో, వివిధ సమస్యలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించడానికి ప్రజాస్వామ్య మార్గాలు ఉన్నాయి,” అని ఆయన తెలిపారు. 
 
ఈ వివాదంలో ఆర్ఎస్ఎస్ నేరుగా జోక్యం చేసుకోవాలా? అని ప్రశ్నించినప్పుడు, భారతదేశ సంస్థలు, రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు ఇటువంటి అంశాలను పరిష్కరించే సామర్థ్యాన్ని పూర్తిగా కలిగి ఉన్నాయని అంబేకర్ పేర్కొన్నారు. ప్రతి ప్రజా చర్చలోనూ ఆర్ఎస్ఎస్ హడావిడిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వివాదాలు,  ఆందోళనలను పరిష్కరించడానికి ఇప్పటికే ప్రజాస్వామ్య యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. 
 
పాకిస్థాన్‌తో ప్రజల మధ్య సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం గురించి పీటీఐ ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్  సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలపై అంబేకర్ మాట్లాడుతూ, తమ సంస్థ అటువంటి సంప్రదింపులకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. 
 
ప్రభుత్వ స్థాయి చర్చలు రాజకీయ, దౌత్యపరమైన నిర్ణయంగా ఉన్నప్పటికీ, అధికారిక మార్గాలు చురుకుగా లేనప్పుడు ప్రజల మధ్య సంభాషణలు కొనసాగాలని ఆయన సూచించారు. “అయితే, విషయాలు అధికారిక మార్గాల ద్వారా ముందుకు సాగనప్పుడు కూడా, ప్రజల మధ్య జరుగుతున్న సంభాషణలను కొనసాగించాలని ఆయన (హోసబాలే) పేర్కొనడం వాస్తవం” అని చెప్పారు. 
 
“కొన్ని సమస్యలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. అలాగే వాణిజ్యం కూడా కొనసాగుతోంది. ఇరుపక్షాల సంబంధాలు నిలిచి ఉండాలంటే ఈ ప్రక్రియను కొనసాగించాలి. తద్వారా క్రమంగా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి,” అని ఆయన పెక్రోన్నారు. భారతదేశ విభజనను ఆర్‌ఎస్‌ఎస్ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉందని అంబేకర్ స్పష్టం చేశారు. ఆ సమయంలో తమ సంస్థ మరింత బలంగా ఉండి ఉంటే, విభజన జరిగి ఉండేది కాదని కూడా ఆయన తేల్చి చెప్పారు.