ఐరోపాలోని తన సైనిక దళాల బ్రిగేడ్ల సంఖ్యను నాలుగు నుండి మూడుకు తగ్గిస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ (పెంటగాన్) ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. ఈ తాజా తగ్గింపు నిర్ణయంతో ఐరోపాలో అమెరికా సైనిక మోహరింపు తిరిగి 2021 నాటి స్థాయికి చేరుకోనుంది. యూరప్ రక్షణ విధులకు కేటాయించిన బ్రిగేడ్ కాంబాట్ టీమ్ (బిసిటి)ల సంఖ్యను తగ్గించడం ద్వారా ఈ మార్పులు చేయనున్నారు.
కాంగ్రెస్ నివేదిక ప్రకారం ఒక బిసిటిలో సుమారు 4,000 నుండి 4,700 మంది సైనిక సిబ్బంది ఉంటారు. ఈ బ్రిగేడ్ల తగ్గింపు కారణంగా పోలాండ్కు అమెరికా బలగాల మోహరింపు ప్రక్రియలో తాత్కాలికంగా జాప్యం జరుగుతోందని పెంటగాన్ పేర్కొంది. అయితే దీనిపై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ స్పందిస్తూ, పోలాండ్కు 4,000 మంది సైనికులను పంపే ప్రణాళిక వాయిదా పడిందే తప్ప, రద్దు కాలేదని స్పష్టం చేశారు.
అమెరికా వ్యూహాత్మక, కార్యాచరణ అవసరాలపై మరింత విశ్లేషణతో పాటు, ఐరోపా రక్షణకు మన మిత్రదేశాలు తమ దళాలను అందించగల సామర్థ్యాన్ని అనుసరించి, ఐరోపాలోని ఇతర అమెరికా దళాల తొలగింపుపై తమ శాఖ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని పెంటగాన్ ఆ ప్రకటనలో తెలిపింది.
ఇరాన్పై అమెరికా నేతృత్వంలోని యుద్ధ వ్యూహాలకు మద్దతు ఇవ్వడంలో విఫలమైనా, లేదా వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిలో శాంతి పరిరక్షక దళానికి సహకరించని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరించాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగమే ఈ బలగాల ఉపసంహరణ అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మే నెల ప్రారంభంలో జర్మనీ నుండి కూడా 5,000 మంది సైనికులను వాషింగ్టన్ ఉపసంహరించుకోనున్నట్లు పెంటగాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Stories
ప్రేమ బంధాల్లో ఉండే టీనేజర్లకు నేపాల్ ప్రభుత్వం ఊరట
భారత్- ఇటలీ మధ్య `ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’
ట్రంప్ సైనిక చర్యల అధికారాలకు సెనేట్ కళ్లెం