సింధూ జలాలపై ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు చెల్లదన్న భారత్ 

సింధూ జలాలపై ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు చెల్లదన్న భారత్ 
పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమం పర్యవసానంగా జరిగిన పరిణామాలలో ఆపరేషన్ సిందూర్ తో పాటు సింధూ నదీ జలాల నిలిపివేత, ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు నిలిపివేత, వాఘా బోర్డర్ క్లోజ్, ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత వంటి అనేక కఠిన నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. 
పాకిస్థాన్‌ తో ఉన్న సింధూ జలాల ఒప్పందం విషయంలో భారత్ కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ రక్తం, నీరు కలిసి పారలేవు అని గతంలో ప్రధాని మోదీ చెప్పినట్టుగా సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. దాంతో పాకిస్థాన్ కు నీటి సమస్య తీవ్రం కావడంతో భారత్ నిర్ణయంపై పాకిస్థాన్ ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు, వేదికల ద్వారా ప్రశ్నించింది.  తాజాగా సింధూ జలాల ఒప్పందంకు సంబంధించి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ పూర్తిగా తిరస్కరించింది.
ఆ కోర్టుకు చట్టబద్ధత లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.  ఇదే విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా ఏర్పాటైన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మే 15న తీర్పును వెల్లడించింది. కానీ ఈ కోర్టును గానీ దాని చట్టబద్ధతను గానీ భారత్ ఎప్పుడూ గుర్తించలేదు. కాబట్టి ఈ కోర్టు ద్వారా జరిగే ఎలాంటి విచారణలు, ఇచ్చే తీర్పులు, నిర్ణయాలు ఏవైనా సరే భారత్ దృష్టిలో చెల్లవు అని స్పష్టం చేశారు. 
 
మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగ, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ ల రూపకల్పనపై పాకిస్థాన్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్ ల వల్ల తమకు వచ్చే నీటి లభ్యత తగ్గుతుందని పాకిస్థాన్ కీలక ఆరోపణలు చేసింది. అయితే ఈ వివాదం పరిష్కారం కోసం ఓ న్యూట్రల్ ఎక్స్ పర్ట్ ను భారత్ కోరింది. కానీ పాకిస్థాన్ మాత్రం ఏక పక్షంగా అంతర్జాతీయ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ను ఆశ్రయించింది. దాంతో భారత్ ఈ తీర్పును బహిష్కరించింది.
 
“అక్రమంగా ఏర్పాటైన ఈ కోర్టును భారత్ ఎప్పుడూ గుర్తించలేదు. ఈ కోర్టు ద్వారా జరిగే ప్రక్రియలు, తీర్పులు, నిర్ణయాలు అన్నీ చెల్లవు. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే భారత నిర్ణయం యథాతథంగా కొనసాగుతుంది” అని జైస్వాల్ పేర్కొన్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం సాధ్యమా అనే ప్రశ్నలు తలెత్తినా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో సాధారణ సహకారం కొనసాగించడం సాధ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. జాతీయ భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని తేల్చి చెప్పింది.
ఇదిలా ఉండగా, సింధూ జలాల విడుదలపై పాకిస్థాన్ పీ‌సీఏను ఆశ్రయించింది. ముఖ్యంగా భారత ప్రాజెక్టుల కారణంగా తమకు కేటాయించిన నీటి ప్రవాహం ప్రభావితమవుతోందని పాక్ వాదిస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తాజాగా మరో అవార్డు జారీ చేసినా భారత్ మాత్రం ఈ ప్రక్రియ మొత్తాన్ని చెల్లనిదిగా కొట్టిపారేస్తోంది.