యూఏఈ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి

యూఏఈ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి

* ముగ్గురు భారతీయులకు గాయాలు- ప్రధాని మోదీ ఆగ్రహం 

యూఏఈలోని ఫుజైరా ఆయిల్‌ ఇండస్ట్రీ జోన్‌లోని ఓ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ చేసిన డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. ఇరాన్ డ్రోన్ దాడి ఫలితంగా ఫోయిజ్ లో  అగ్నిప్రమాదం సంభవించిందని యూఏఈ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వార్తా సంస్థ పేర్కొంది. వెంటనే స్పందించిన ఫుజైరా సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేపట్టాయని చెప్పింది. 
 
చమురు కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత ముగ్గురు భారత పౌరులు గాయపడ్డారని, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించింది. ఇరాన్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలపై నాలుగు క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో మూడింటిని దేశ ప్రాదేశిక జలాల్లో విజయవంతంగా కూల్చివేయగా, ఒకటి సముద్రంలో పడిపోయింది పేర్కొంది. 
 
ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినప్పుడు, అన్ని ప్రజా భద్రతా విధానాలను పాటించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఆకాశం నుంచి పడిన ఏ శకలాలు లేదా వస్తువులను సమీపించవద్దని, తాకవద్దని లేదా ఫోటోలు తీయవద్దని పౌరులకు, నివాసితులకు సూచించింది. వదంతులను ప్రచారం చేయవద్దని, సమాచారం కోసం అధికారిక వర్గాలపై మాత్రమే ఆధారపడాలని అధికారులు ప్రజలను కోరినట్లు గల్ఫ్ న్యూస్ పేర్కొంది.

మరోవైపు ఇరాన్​ డ్రోన్‌ దాడులను యూఏఈ ఖండించింది. “ఈ దాడులు ప్రమాదకరమైన ఉద్రిక్తతను పెంచుతాయి. ఇది ఆమోదయోగ్యం కాని దురాక్రమణ చర్య. అంతర్జాతీయ చట్ట సూత్రాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘిస్తోంది. యూఏఈ భద్రత, స్థిరత్వం, ప్రాదేశిక సమగ్రతకు ప్రత్యక్ష ముప్పు. తమ భద్రత, సార్వభౌమాధికారానికి ఎలాంటి ముప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం” అని హెచ్చరించింది. 

“రక్షించుకునే క్రమంలో ఇలాంటి దాడులకు ప్రతిస్పందించే పూర్తి చట్టబద్ధమైన హక్కు యూఏఈకి ఉంది. ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలి. అన్ని శత్రుత్వాల విరమణకు పూర్తిగా కట్టుబడి ఉండాలి. ఈ దాడులు, వాటి పర్యవసానాలకు ఇరాన్​ పూర్తిగా బాధ్యత వహించాలి” అని యూఏఈ పేర్కొంది.

యూఏఈలో జరిగిన దాడిలో భారతీయులు గాయపడడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడుల్లో ముగ్గురు భారత పౌరులు గాయపడ్డారు. పౌరులను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. యూఏఈకి భారత్ గట్టి మద్దతు తెలుపుతుంది. చర్చలు, దౌత్యం ద్వారా అన్ని సమస్యల శాంతియుత పరిష్కారానికి తన మద్దతును పునరుద్ఘాటిస్తుంది” అని స్పష్టం చేశారు.