ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వెనక్కి తగ్గమని, పోరాడుతూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం కోసం తాము ఎంతగానో ప్రయత్నించామని, అయితే కాంగ్రెస్, సమాజ్వాది పార్టీలాంటి ప్రతిపక్ష పార్టీల నీచ రాజకీయాలవల్లే ఆ చట్టం అమల్లోకి రాకుండా ఆగిపోయిందని ప్రధాని ఆగ్రహం వ్యక్తంచేశారు.
లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడమనే మహా యజ్ఞాన్ని మొదలు పెట్టేందుకు తాము సిద్ధమవుతున్నామని ప్రధాని తేల్చి చెప్పారు. అందుకోసం మాతృమూర్తుల ఆశీస్సులు తీసుకునేందుకు వారణాసి వచ్చానని ప్రధాని చెప్పారు. ఈ బిల్లును తేవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదని ప్రధాని చెప్పారు.
సాధారణ కుటుంబాల మహిళలు పార్లమెంటు, అసెంబ్లీలకు రావాలని కోరుకున్నానని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అధికారం తమ కుటుంబాలకే పరిమితం కావాలని కోరుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లపై తమ పోరాటం ముగిసిపోలేదని, చట్టాన్ని అమలు చేసేవరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు.
“గత 40 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల అమలుకు ఈ పార్టీలే అడ్డుకట్ట వేశాయి. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ మరోసారి దీనికి ‘రెడ్ సిగ్నల్’ (అడ్డు) చూపించింది. మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. మీ రిజర్వేషన్ హక్కులు అమలు అయ్యేలా చూడటానికి నేను శాయశక్తులా కృషి చేస్తాను. అసలు నిజం ఏమిటంటే, ఈ కుటుంబ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలపై ఆధారపడే పార్టీలన్నీ మహిళల శక్తిని చూసి భయపడుతున్నాయి. మీ అందరినీ చూసి వారు భయపడుతున్నారు” అంటూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు.

More Stories
గుజరాత్ మున్సిపోల్స్లో బిజెపి క్లీన్స్వీప్
హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు
రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న ఐదో దేశంగా భారత్