పంజాబ్‌లో రైల్వే ట్రాక్ పేల్చివేత‌.. పేలుడుతో నిందితుడు మృతి 

పంజాబ్‌లో రైల్వే ట్రాక్ పేల్చివేత‌.. పేలుడుతో నిందితుడు మృతి 

పంజాబ్‌లోని పాటియాలా స‌మీపంలో రైల్వే ట్రాక్ వ‌ద్ద పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. అయితే బాంబును పేల్చేందుకు ఓ వ్య‌క్తి ప్ర‌య‌త్నించాడ‌ని, ఆ బాంబును ఆప‌రేట్ చేయ‌బోయి ఆ వ్య‌క్తి కూడా చ‌నిపోయినట్లు సీనియ‌ర్ పోలీసు ఆఫీస‌ర్ ఒక‌రు తెలిపారు. శంబూ, రాజ్‌పురా మార్గంలో ఉన్న బొతోనియా గ్రామం వ‌ద్ద రైల్వే ట్రాక్ స‌మీపంలో పేలుడు జ‌రిగింది. అయితే అక్క‌డ ఓ వ్య‌క్తి శ‌రీర భాగాలు చెల్లాచెదురుగా ప‌డి ఉన్న‌ట్లు గుర్తించారు.

బాంబునే పేల్చే క్ర‌మంలో అత‌ను చ‌నిపోయి ఉంటాడ‌ని పాటియాలా ఎస్ఎస్పీ వ‌రుణ్ శ‌ర్మ తెలిపారు. శంబూ-అంబాలా రైల్వే ట్రాక్ మార్గంలో ప్ర‌స్తుతం రిపేర్ వ‌ర్క్ చేస్తున్నారు. బాంబు పేలుడులో మ‌ర‌ణించిన వ్య‌క్తిని జ‌గ‌రూప్ సింగ్‌గా గుర్తించారు.  అత‌ను త‌ర‌న్ తార‌న్‌కు చెందిన‌ట్లు గుర్తించారు. జగరూప్ ఖడూర్ సాహిబ్ ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌కు మద్దతుదారుడు. ఎన్నికల సమయంలో ఆయన తరపున ప్రచారం కూడా చేశారు.

వివాహితుడైన జగరూప్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు; ఆయన కొంతకాలం దుబాయ్‌లో కూడా పనిచేశారు.రైల్వే ట్రాక్‌ను పేల్చ‌బోయి, నిందిత ఆప‌రేట‌ర్‌ కూడా పేలిన‌ట్లు విచార‌ణ‌లో తేలింద‌ని పోలీసులు చెప్పారు. సోమ‌వారం రాత్రి 10 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పేలుడు వ‌ల్ల రైల్వే ట్రాక్ కాస్త ధ్వంసం అయ్యింది. కొన్ని రైళ్ల‌ను దారి మ‌ళ్లీంచారు. త‌క్కువ తీవ్ర‌త‌తో బాంబు పేలింద‌ని తొలుత భావించామ‌ని, కానీ దాన్ని పేల్చే ప్ర‌య‌త్నంలో నిందితుడు కూడా పేలి ముక్క‌లైన‌ట్లు ఎస్పీ వెల్ల‌డించారు.

ఆ స్పాట్ నుంచి ఓ సిమ్ కార్డును రిక‌వ‌రీ చేశామ‌ని, దీని ఆధారంగా టెక్నిక‌ల్ ద‌ర్యాప్తు మొద‌లుపెట్టిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న వెనుక ఉన్న కుట్ర‌ను చేధించ‌నున్న‌ట్లు పోలీసులు చెప్పారు. జీఆర్పీఎఫ్‌, ఆర్పీఎఫ్ ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నాయి. ఫ‌తేఘ‌ర్ సాహిబ్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై జ‌న‌వ‌రిలో పేలుడు జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌లో ఇంజిన్ ధ్వంసం కాగా, లోకో పైలెట్ గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే.