పెట్రోల్ బదులుగా ఇథనాల్ వాడేందుకు త్వరలోనే ఈ-85 ఇంధనం

పెట్రోల్ బదులుగా ఇథనాల్ వాడేందుకు త్వరలోనే ఈ-85 ఇంధనం

దేశంలో త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ కనుమరుగై ఆల్కహాల్‌ ఇంధనం అమల్లోకి రానుందా?  దేశంలో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నది.  దీనిపై కేంద్ర స్థాయిలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. కొత్త విధానం కనుక అమలైతే త్వరలోనే కార్లు, ఇతర వాహనాలు ఆల్కహాల్‌ ఇంధనంపై నడుస్తాయి.  పెట్రోల్‌లో 20 శాతం ఉండే ఈ-20 ఇథనాల్‌కు స్వస్తి పలికే అవకాశం ఉంది.

పశ్చిమాసియాలో యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన కొరత ఏర్పడిన క్రమంలో దాని దుష్ప్రభావాలను భారత్‌ సైతం ఎదుర్కొంది. ఇకపై భారత్‌ ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడకూడదని భావించి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా, త్వరలోనే ఆల్కహాల్‌తో కూడిన ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. దీని కోసం 85 శాతం ఇథనాల్‌, 15 శాతం పెట్రోల్‌ మిశ్రమంతో కూడిన ఈ-85ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

దీనికి సంబంధించి ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను జారీ చేయడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం. పెట్రోల్‌ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇదే మంచి ప్రత్యామ్నాయమని భారత్‌ భావిస్తున్నది.  2016లోనే రూపొందిన ఈ ప్రణాళిక త్వరలోనే అమలులోకి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇథనాల్‌ 85 (ఈ-85)కు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుంది. ప్రాథమిక పరీక్షలు కూడా నిర్వహించారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక అధికారి వెల్లడించారు. 

అయితే, ఈ-85 లేదా ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కోసం ఇంజిన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దీని విడుదల రెండు సంవత్సరాలలో జరుగుతుందని అంచనా. ఈ-85ను ఒక ప్రత్యేక ఇంధన గ్రేడ్‌గా పరిచయం చేస్తారు. ప్రస్తుతమున్న ఈ-20 పెట్రోల్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ-20లో ఇథనాల్‌ను పెట్రోల్‌లో 27 శాతం కలపవచ్చు. 

ప్రస్తుతం ఈ-20 పెట్రోల్‌ అమ్మకాలను ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అన్ని రాష్ర్టాలు, యూటీల్లో తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మన దేశ చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఈ-85 అమల్లోకి వస్తే దిగుమతులు 80 శాతానికి పైగా తగ్గే అవకాశం ఉంది. ఇథనాల్‌ పునరుత్పాకదమైనదే కాక, స్వచ్ఛమైన పెట్రోల్‌ కంటే బాగా మండుతుంది.

ఈ-85 ఇంధనాన్ని అమల్లోకి తేవాలి అంటే కొత్త ఇంజిన్లు తయారు చేయాలి. ప్రామాణిక పెట్రోల్‌ ఇంజిన్లు, ఫ్యూయల్‌ సిస్టమ్‌లు ఇంత అధిక ఆల్కహాల్‌ శాతాన్ని నిర్వహించేలా నిర్మించి లేదు. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వెహికిల్స్‌ (ఎఫ్‌ఎఫ్‌వీ) కింద తయారు చేసిన వాహనాల్లో మాత్రమే ఈ-85 ఇంధనాన్ని వాడాల్సి ఉంటుంది. దీనిని అమల్లోకి తెస్తే దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్‌ బంకుల్లో వీటి నిల్వకు ఏర్పాట్లు, ప్రత్యేక ఫ్యూయల్‌ పంపులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.