నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్షా తేల్చి చెప్పారు. నూతన చట్టాలపై రైతుల్లో ఉన్న అపోహలను, భయాలను దూరం చేస్తామని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమిత్షా పేర్కొన్నారు.
అలాగే కనీస మద్దతు ధరపై కూడా రైతులకు భరోసా ఇస్తామని ఆయన తెలిపారు. కనీస మద్దతు ధర, మార్కెట్ కమిటీల గురించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా సీఎంలతో రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పారు. అయితే నూతన చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అమిత్షా తేల్చి చెప్పారు.
మరోవైపు రైతులతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు ప్రారంభించారు. రైతులు, ప్రభుత్వం మధ్య కృషి విజ్ఞాన్ భవన్లో చర్చలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రులు పీయూశ్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ ఈ చర్చలకు హాజరయ్యారు.
‘‘నేను, కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్, ఇతర అధికారులు ఈ చర్చలకు హాజరవుతున్నాం.’’ అని తోమర్ ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అపోహలను తొలగించే ప్రయత్నం కేంద్ర మంత్రులు చేస్తున్నట్లు సమాచారం. మొదట రైతుల వాదనలు శ్రద్ధగా ఆలకిస్తామని, ఆ తరువాతే ప్రభుత్వ సమాధానాలు ఉంటాయని తోమర్ ప్రకటించారు.
రైతులు తమ నిరసనను ఉద్ధృతం చేసిన నేపథ్యం, చర్చల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్, తోమర్ సమావేశమయ్యారు. రైతులతో చర్చించాల్సిన అంశాలు, చర్చలు ఎలా జరిగితే ఆందోళనను విరమిస్తారన్న అంశాలను వీరు చర్చించినట్లు తెలుస్తోంది.
More Stories
కొత్త ప్రభుత్వానికి 100 రోజుల మాస్టర్ ప్లాన్!
లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ నేడే
మోదీ వారణాసిలో రేపే నామినేషన్.. ఘనంగా రోడ్ షో