ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ మాజిద్ ఖదేమీ హతం

ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ మాజిద్ ఖదేమీ హతం

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ సోమవారం హతమయ్యారు. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ ప్రకటించినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది.  సోమవారం ఉదయం జరిగిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో ఖదేమీ చనిపోయినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించినట్లు తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన జారీ చేసింది. అయితే ఈ దాడుల విషయమై ఇజ్రాయెల్ వెంటనే స్పందించలేదు. 

‘‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్‌ అధిపతి.. విద్యావంతుడు, శక్తివంతుడైన మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ.. నేడు (సోమవారం) తెల్లవారుజామున అమెరికన్-జియోనిస్టు శత్రువుల నేరపూరిత ఉగ్రదాడిలో వీరమరణం పొందారు’’ అని అని ఐఆర్‌జీసీ తమ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్టు చేసింది.  ఐఆర్‌జీసీ చీఫ్ నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్‌కు రిపోర్టు చేస్తారు. సుమారు 50 ఏళ్లపాటు సేవలు అందిచిన ఖదేమీ గూఢచర్యం, సెక్యూరిటీ సర్వీసుల్లో కీలక పాత్ర పోషించారు.

మాజిద్‌ ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు, ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్ విభాగానికి కూడా నాయకత్వం వహించాడు. ఇరాన్‌కు సంబంధించి కీలక విభాగాల్లో ఉన్న అగ్ర నేతల్లో మాజిద్ చివరివాడు అయినట్లు తెలుస్తోంది.  ఖదేమీ మరణం ఐఆర్‌జీసీ వ్యూహాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. గత నెలలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ సైతం ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదెమిని సైన్యం హత్య చేయడాన్ని ప్రశంసిస్తూ, ఇజ్రాయెల్ తన యుద్ధ లక్ష్యాలను “పూర్తి శక్తితో కొనసాగిస్తుంది” అని ఎక్స్ లో హిబ్రూ భాషలో ఒక పోస్ట్ లో ప్రతిజ్ఞ చేశారు.

మరోవంక, సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని షరీఫ్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ వైమానిక దాడులకు పాల్పండింది. ఈ దాడుల్లో 25 మంది మృతి చెందారు. టెహ్రాన్‌లోని ప్రభుత్వ పాలనా లక్ష్యాలను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశామని ఈ దాడుల్లో 25 మంది మృతి చెందారని ఇజ్రాయిల్‌ సైన్యం సోమవారం ప్రకటించింది. 

హర్మోజ్‌ జలసంధిని 48 గంట్లో తెరవాలని లేకపోతే నరకం చూపిస్తామని అమెరికా ఇరాన్‌ని హెచ్చరించిన తర్వాత ఇజ్రాయిల్‌ అత్యంత దారుణంగా దాడులకు పాల్పడింది. కాగా, ఇజ్రాయిల్‌ జరిపిన తాజా దాడులపై ఇరాన్‌ కేంద్ర సైనిక కమాండ్‌ అమెరికాను హెచ్చరించింది. తమ ప్రత్యర్థులు పౌర లక్ష్యాలపై దాడి చేస్తే తాము మరింత విధ్వంసకరమైన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ కేంద్ర సైనిక కమాండ్‌ హెచ్చరించింది.