* పాక్ నేతల ‘ఉగ్ర’ బంధం బట్టబయలు
పాకిస్థాన్ ప్రభుత్వం, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మధ్య విడదీయరాని అనుబంధం మరోసారి బహిర్గతమైంది. ముంబయి 26/11 ఉగ్ర దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడు ఒకే వేదికను పంచుకోవడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.
తల్హా సయీద్తో పాక్ ప్రధాని రాజకీయ వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా దిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఫైసలాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఇరువురూ ఆలింగనం చేసుకుని, కరచాలనం చేస్తూ చర్చించికుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబయి 26/ 11 ఉగ్రదాడులు, 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడులకు సూత్రధారి అయిన లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ భారత్కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది.
జమ్మూ కశ్మీర్లో హింసను ప్రేరేపించడం, ఉగ్రవాదుల నిధుల సేకరణకు సంబంధించి అతడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) పలు కేసులు నమోదుచేసింది. తాజాగా, పాకిస్థాన్ ప్రధాని సలహాదారు హోదాలో ఉన్న వ్యక్తి అంతర్జాతీయ ఉగ్రవాది తనయుడితో బహిరంగంగా గడపడం దాయాది పాలకుల ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపుతోంది. ఈ ఉదంతం వెలుగులోకి రావడానికి కొద్ది రోజుల ముందే అమెరికా కాంగ్రెస్ పాక్ ఉగ్రవాదంపై కీలక నివేదికను విడుదల చేసింది.
పాక్ భూభాగంలో ఇప్పటికీ 15కిపైగా ఉగ్రవాద సంస్థలు చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని, భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులకు ఆ దేశం ఆశ్రయం ఇస్తుందని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక వెల్లడించింది. లష్కరే తొయిబా, భారత్ పార్లమెంట్పై దాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాదులు చురుగ్గానే ఉన్నాయని తెలిపింది. ఈ ఉగ్రవాద సమూహాలకు పాక్ వేదికగా, దాడులకు కేంద్రంగా మారిందని హెచ్చరికలు చేసింది. ఇదే సమయంలో గతంతో పోల్చితే ప్రస్తుతం పాకిస్థాన్లో ఉగ్రవాదుల దాడులు పెరిగినట్టు సీఆర్ఎస్ నివేదిక వెల్లడించింది.

More Stories
హర్మూజ్ను తెరిచేందుకు 35 దేశాలతో బ్రిటన్ దౌత్య సదస్సు
ఇరాక్లో అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్
నాటో కూటమి నుంచి వైదొలగే యోచనలో ట్రంప్!