హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఖార్గ్ ద్వీపాన్ని పేల్చేస్తాం

హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఖార్గ్ ద్వీపాన్ని పేల్చేస్తాం

* ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక 

అంతర్జాతీయ జల రవాణాకు ఆయువుపట్టైన హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తమ మాట వినకుంటే ఖార్గ్ ద్వీపాన్ని పేల్చేస్తామ ట్రంప్‌ ఇరాన్‌కు స్పష్టం చేశారు. మొండిగా వ్యవహరిస్తున్న ఇరాన్‌కు బుద్ధి చెప్పేందుకు అవసరమైతే చమురు బావులను కూడా పేల్చేస్తామని  ట్రుత్ వేదికగా ట్రంప్ ప్రత్యర్థిని హెచ్చరించారు. 

పశ్చిమాసియా యుద్ధంలో ఆది నుంచి చర్చకు వస్తున్న హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌ వెనక్కి తగ్గేడం లేదు. ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరాలో కీలకమైన ఈ జలసంధిని తెరిచి ఉంచాలని ట్రంప్ డెడ్‌లైన్ విధించినా  శత్రు దేశాల నౌకలను అనుమతించమని ఇరాన్ స్పష్టం చేసింది.  ఆ దేశం తీరుతో విసుగొచ్చిన ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు.

టెహ్రాన్, వాషింగ్టన్ డీసీ మధ్య ఒప్పందం కుదరకుంటే హర్మూజ్‌ను తెరవకుంటే ఇరాన్‌ వ్యూహాత్మక స్థావరమైన ఖార్గ్ ద్వీపాన్ని, ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా పేల్చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రుత్ ద్వారా ఇరాన్‌ను హెచ్చరించారు.

“ఇరాన్‌లో సైనిక చర్యలను ముగించాలనే విషయంపై అమెరికా తీవ్రంగా చర్చిస్తోంది. ఇప్పటికే చాలా పురోగతి సాధించాం. కానీ, ఏదైనా కారణం వల్ల ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరకుంటే, హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవకంటే ఇరాన్‌లో మా ప్రేమపూర్వక విడిదిని ముగిస్తాం. అన్ని విద్యుత్ కేంద్రాలు, చమురు బావులతో పాటు ఇన్నిరోజులు ఉద్దేశపూర్వకంగా మేము దాడికి పాల్పడని ఖార్గ్ ద్వీపాన్ని కూడా పేల్చేస్తాం” అని స్పష్టం చేశారు.

“ఇరాన్‌లో గత 47 ఏళ్లుగా కొనసాగిన ప్రభుత్వం మా దేశ సైనికులు, ఇతరులను దారుణంగా చంపేసింది. ఆ నేరానికి శిక్ష వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు” అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఓవైపు ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ ప్రకటిస్తున్నా ఆ దేశ ప్రతినిధులు మాత్రం అదేం లేదని అంటున్నారు. చర్చలు అంటూనే పశ్చిమాసియాపై దాడులకు ట్రంప్ సిద్ధమవుతున్నారని వారు మండిపడితున్నారు.

కాగా, ఇరాన్‌కు చెందిన అత్యధిక ఎగుమతులు జరిగే పర్షియన్‌ గల్ఫ్‌లోని ఖర్గ్‌ ద్వీపంపైనే అమెరికా ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. చైనాకు నేరుగా చమురు ఎగుమతులు ఖర్గ్‌ నుంచే జరుగుతున్నాయి. ఖర్గ్‌ను స్వాధీనం చేసుకున్నా లేక దానిపై పట్టు సాధించినా అది ఇరాన్‌ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీయగలదు. అంతేగాక ప్రపంచ ఇంధన ప్రవాహంపై అమెరికా ఆధిపత్యానికి ఇది మరింత దోహదపడగలదు.