23న బిజెపి తెలంగాణ అసెంబ్లీ ముట్టడి

23న బిజెపి తెలంగాణ అసెంబ్లీ ముట్టడి

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలకు నిరసనగా, మార్చి 23న బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామని  బిజెపి ఎమ్మెల్సీ మల్క కొమురయ్య వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు, రెవెన్యూ అంచనాలు, వాస్తవ ఖర్చుల మధ్య స్పష్టత లేకుండా గందరగోళంగా ఉందని కొమురయ్య విమర్శించారు.  విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొంటూ తాము ఎప్పటికప్పుడు 15% కేటాయించాలని డిమాండ్ చేస్తుంటే, కేవలం సుమారు 8% మాత్రమే ఇచ్చారని విచారం వ్యక్తం చేశారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 14% నుంచి 18% వరకు విద్యకు కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి ముఖ్య రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడాన్ని గొప్పగా చెప్పుకుంటూ కేంద్ర పథకాలను తమవిగా ప్రచారం చేసుకుంటోందని కొమరయ్య ఎద్దేవా చేశారు.  మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వలేక, సరైన సమన్వయం లేక అనేక పథకాలు నిలిచిపోతున్నాయని తెలిపారు. సోలార్ పంపుల వంటి పథకాలలో కూడా రాష్ట్రం వెనుకబడిందని చెప్పారు.

విద్యార్థుల స్కాలర్షిప్‌లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు సరిగా అమలు కావడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఏ శాఖను చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని అంటూ పేదలకు ఇండ్ల నిర్మాణం నుంచి రైతుల సమస్యల వరకు ప్రతి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించారు.