ఢిల్లీలో పాకిస్థాన్‌ లింక్డ్‌ గూఢచర్య ముఠా గుట్టురట్టు

ఢిల్లీలో పాకిస్థాన్‌ లింక్డ్‌ గూఢచర్య ముఠా గుట్టురట్టు
దేశ రాజధాని ఢిల్లీలో పాకిస్థాన్‌ తో సంబంధం కలిగిన ఓ భారీ గూఢచర్య ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ గూఢచర్య ముఠా వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు ఘజియాబాద్ పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఢిల్లీలోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌ లో పోలీసులు రహస్య కెమెరాను గుర్తించారు. విచారణ జరిపి ఆ కెమెరాతో నిందితులు గూఢచర్యానికి పాల్పడినట్లు తెలుసుకున్నారు.
 
పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులను సుహైల్ మాలిక్, ప్రవీణ్, రాజ్, శివ, హృతిక్, ఇరమ్ అలియాస్ మహక్‌గా గుర్తించారు. వీరిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు పలు రాష్ట్రాల్లోని కీలకమైన ప్రదేశాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు, వీడియోలు మరియు లొకేషన్ వివరాలను పాకిస్తాన్‌లో ఉన్న తమ సూత్రధారులతో పంచుకుంటున్నారు.

నిందితులు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌లో రహస్య కెమెరాను అమర్చి, పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు లైవ్ ఫుటేజ్ పంపినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్ల నుంచి వాట్సాప్ ద్వారా ఆదేశాలు అందుకుని, దేశంలోని సున్నితమైన ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.

నిందితులు ఒక్కో అసైన్‌మెంట్‌కు పాక్‌ హ్యాండ్లర్ల నుంచి రూ.10,000 నుంచి రూ.15,000 వరకు తీసుకున్నట్లు తెలిపారు. ముంబై, ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్ రీజియన్‌ పరిధిలోని రైల్వే స్టేషన్‌లు  ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ మోహరింపు పాయింట్లు, రక్షణ శాఖ కార్యాలయాలు, భద్రతా ఏజెన్సీల కదలికలను వీరు వీడియో తీసి పాక్‌ హ్యాండ్లర్లకు పంపినట్లు పోలీసులు కనుగొన్నారు.  నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

నిందితులు కొంత డేటాను డిలీట్ చేయగా దాన్ని తిరిగి పొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌ను విస్తరించడం కోసం మరికొంత మందిని నియమించుకోవాలని కూడా నిందితులు ప్రయత్నం చేసినట్లు తెలిసింది.  ఢిల్లీలోని కంటోన్మెంట్ వంటి కీలక రైల్వేస్టేషన్ నుంచి నేరుగా లైవ్ ఫుటేజ్ పాకిస్థాన్‌కు చేరడం అత్యంత ఆందోళనకరమని అధికారులు అంటున్నారు. ఈ సమాచారంతో ఉగ్రదాడులకు ప్లాన్‌ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.