ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లో అమెరికా సుమారు 11.3 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్ ఈ విషయాన్ని ఆదేశ చట్టసభ ప్రతినిధులకు తెలియజేసినట్లు ఓ మీడియా కథనం పేర్కొన్నది. మందుగుండు సామగ్రి మరియు క్షిపణి ఇంటర్సెప్టర్ల కోసం దాదాపు $4 బిలియన్లు ఖర్చు చేశారు.
అనూహ్య రీతిలో ఇరాన్ ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో అమెరికా భారీగా తన ఆయుధ సంపత్తిని వినియోగించాల్సి వస్తున్నది. ఆయుధాలను విరివిగా వాడుతోంది. దీంతో ఖర్చు విపరీతంగా అవుతున్నట్లు అంచనాలు వేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంకా చాలా విషయాల్లో ఖర్చును మినహాయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ఖర్చును కూడా జోడిస్తే, అప్పుడు యుద్ధం ఖర్చు తొలి వారంలోనే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు మీడియా కథనంలో వెల్లడించారు.
అమెరికా రక్షణశాఖ అధికారులు ఇదే విషయాన్ని ఆ దేశ చట్టసభ ప్రతినిధులకు కూడా చెప్పారు. కేవలం తొలి రెండు రోజుల్లోనే సుమారు 5.6 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఆయుధాలను వాడినట్లు తెలుస్తోంది. ఇది అంచనా వేసిన దాని కన్నా అధికంగా ఉన్నట్లు తేల్చారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కోసం తొలి 100 గంటల్లోనే సుమారు 3.7 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు వాషింగ్టన్కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తన రిపోర్టులో పేర్కొన్నది.
రోజుకు దాదాపు 891 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు తేల్చారు. ఇరాన్ యుద్ధ ఖర్చులను ట్రాక్ చేస్తున్న ఓ వెబ్సైట్ ప్రకారం. గురువారం వరకు అమెరికా ఈ యుద్ధం కోసం సుమారు 17 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఆ సైట్ అంచనా ప్రకారం ప్రతి రోజు యుద్ధం కోసం బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు.
అధిక-తీవ్రత దాడులు మరియు ఖరీదైన, అధిక-ఖచ్చితమైన ఆయుధాల వాడకం కారణంగా మొత్తం కార్యాచరణ ఖర్చులు 10 రోజుల్లో $10 బిలియన్లకు మించి ఉండవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ల మొదటి 10 రోజుల్లో సుమారు 140 మంది అమెరికా సర్వీస్ సభ్యులు గాయపడ్డారని పెంటగాన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నిజానికి ఈ ఖర్చు ఇంకా ఎక్కువే ఉంటుందని, ఎందుకంటే సుదీర్ఘకాలం ఆలోచిస్తే, దీంట్లో వెటరన్ హెల్త్కేర్ ఉండదని, ఒకవేళ దాన్ని కూడా జోడిస్తే అప్పుడు ఖర్చు తడిసి మోపెడు అవుతుందని భావిస్తున్నారు.

More Stories
2 రోజుల్లో గ్యాస్ రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!
కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ ‘సెక్షన్ 301’
ఢిల్లీలో పెట్రోల్ సరఫరాపై అమిత్ షా చైర్మన్ గా మంత్రుల కమిటీ