అసోంలో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం సుఖోయ్ ఎస్యూ- 30 ఫైటర్ జెట్ గాల్లో ఎగురుతుండగా గురువారం సాయంత్రం రాడార్తో సంబంధాలు తెగిపోయినట్టు భారత వాయు సేన అధికారులు వెల్లడించారు. అస్సాంలోని కర్బి అంగ్లాంగ్ జిల్లాలో సుఖోరు-30ఎంకెఐ ఫైటర్ జెట్ కూలిపోయిందని, ఇద్దరు పైలెట్లు మరణించారని ఐఎఎఫ్ శుక్రవారం ప్రకటించింది.
అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ కూలింది. ప్రమాదంలో మృతిచెందిన పైలెట్లను స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దుర్గాకర్గా గుర్తించారు. ఐఏఎఫ్ దళ సభ్యులందరూ ఆ పైలెట్ల మృతి పట్ల సంతాపం చెబుతున్నారని ఐఏఎఫ్ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ట్రైనింగ్ మిషన్లో భాగంగా గురవారం సుఖోయ్-ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం గగనతలంలోకి ఎగిరింది.
అయితే జోర్హాట్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఆ విమానం రేడార్ నుంచి అదృశ్యమైంది. ఎయిర్బేస్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో సుఖోయ్ యుద్ధ విమానం కూలినట్లు గుర్తించారు. రాత్రి 7.42 నిమిషాలకు ఆ విమానంతో కమ్యూనికేషన్ దెబ్బతిన్నది. సమీప కొండ ప్రాంతంలో కూలినట్లు తేల్చారు. కొండ మీద నుంచి భారీ స్థాయిలో శబ్ధం వచ్చినట్లు స్థానిక గ్రామస్తులు తెలిపారు. మంటలు కూడా వ్యాపించినట్లు చెప్పారు.
స్థానికుల ప్రకారం సాయంత్రం అయిన కొద్దిసేపటికే ఎత్తైన కొండ నుంచి శక్తివంతమైన పేలుడు లాంటి శబ్దం వినిపించింది. ఆ శబ్దం చాలా పెద్దగా ఉందని, కొండల మీదుగా ప్రతిధ్వనించడంతో భయభ్రాంతులకు గురైనట్టు చెప్పారు. పేలుడు శబ్దం విన్న తర్వాత తాము ఇళ్ల నుంచి బయటకు వచ్చి, విమానం కూలిపోయి ఉంటుందని భయపడ్డామని తెలిపారు. విమానం కూలిపోయినట్టు శబ్దం వచ్చిన కొండ ప్రాంతం నుంచి పొగలు రావడం చూశామని కొందరు చెబుతున్నారు.
కాగా, 1980లలో రష్యా అభివృద్ధి చేసిన సుఖోయ్ 30 ఎంకేఐ టూ సీటర్ ఇంజిన్ విమానాలు భారత వైమానిక దళానికి వెన్నెముకగా ఉన్నాయి. ఎస్ యు-30 ఎంకెఐ స్క్వాడ్రన్లను ఈశాన్య ప్రాంతంలో భారత వాయుసేన మోహరించింది. ఎస్యూ 30sల తొలి డెలివరీ 1997లో రష్యా అందజేసింది. ప్రస్తుతం వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. భారత వైమానిక దళం వద్ద 250కిపైగా ఫైటర్ జెట్లు ఉన్నాయి.
More Stories
2000 కిలోమీటర్ల రేంజ్ ఖొర్రమ్షార్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్
వాట్సప్చాట్ల్లో క్రూరత్వం ఆధారంగా విడాకులు ఇవ్వలేం
టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్