క్రియాశీల రాజకీయాల్లోకి నితీష్ కుమారుడు నిశాంత్

క్రియాశీల రాజకీయాల్లోకి నితీష్ కుమారుడు నిశాంత్

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశముందని పార్టీ సీనియర్ నేత, మంత్రి శ్రావణ్ కుమార్ తెలిపారు. “హోలీ సందర్భంగా నిశాంత్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారు” అని ఆయన మీడియాకు చెప్పారు.

“హోలీ సందర్భంగా మేము చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, నిశాంత్ జీ అతి త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుతూ వచ్చిన రాష్ట్ర ప్రజలు, యువత కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి” అని జెడి-యు సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రావణ్ కుమార్ తెలిపారు.

కుమార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సన్నిహితమైన నేతగా గుర్తింపు పొందటమే కాకుండా, ఆయన సొంత జిల్లా అయిన నలంద నియోజకవర్గం నుండి అనేకసార్లు పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిశాంత్ కుమార్ ఉజ్వల భవిష్యత్తు, రాజకీయాల్లో విజయం సాధించాలని శ్రావణ్ కుమార్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అయితే, నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి ఎలా ప్రవేశిస్తారో వెల్లడించలేదు.

“మా పార్టీ నాయకులు ఆయన రాజకీయాల్లోకి ఎలా చేరాలో నిర్ణయిస్తారు. ఈ రంగంలో ఆయనకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఆయన చిన్నవాడు, మా నాయకులు ప్రజల డిమాండ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు” అని మంత్రి పేర్కొన్నారు. 

అంతకుముందు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సీనియర్ జెడి-యు నాయకులు సంజయ్ ఝా, నితీష్ కుమార్ మంత్రివర్గంలో గ్రామీణ పనుల శాఖ మంత్రిగా ఉన్న అశోక్ చౌదరి, ఇతరులు కూడా నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తూ పాట్నాలోని జెడి-యు రాష్ట్ర ప్రధాన కార్యాలయం గోడలను కూడా ముందుగా అలంకరించారు.

“నిశాంత్ కుమార్ విద్యావంతుడు, ఇంజనీరింగ్ చదివాడు. పార్టీ శ్రేణులు ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అటువంటి  ప్రకటన మొత్తం జెడి-యు కుటుంబాన్ని సంతోషపరుస్తుంది” అని చౌదరి తెలిపారు. నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని జెడి-యు తీసుకున్న నిర్ణయాన్ని కూటమి భాగస్వామి బిజెపి కూడా స్వాగతించింది.

“ఈ నిర్ణయం పట్ల మేము సంతోషంగా ఉన్నాము. నిశాంత్ కుమార్‌ను క్రియాశీల రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నాము. మేము మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన ప్రయత్నానికి మద్దతు ఇస్తాము” అని రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ హర్షం ప్రకటించారు. జైస్వాల్ బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా.