దేశవ్యాప్తంగా హెచ్‌పివి టీకా ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా హెచ్‌పివి టీకా ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా హెచ్‌పివి టీకా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. శనివారం ఉదయం రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం హెచ్‌పివి టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. 

ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు ‘గార్డాసిల్‌’ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్‌ హెచ్‌పీవీ టైప్‌ 16, 18తో పాటు టైప్‌ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం వివరించింది.  ఈ సందర్భంగా హెచ్​పీవీ వ్యాక్సినేషన్​కు సంబంధించి ప్రధాని మోదీ ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

“దేశంలోని ఆడబిడ్డలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి మేం ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టం. వారు సంపన్నంగా ఉండేలా చూసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో హెచ్​పీవీ టీకా వ్యాక్సినేషన్​ను ప్రారంభించాం. గర్భాశయ క్యాన్సర్ నివారణే ఈ వ్యాక్సినేషన్​ ముఖ్య ఉద్దేశం” అని ప్రధాని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా రావివలసలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లోని కోఠిలో ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6.75 లక్షల మందికి ఈ వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తారు.

దేశవ్యాప్త హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ టీకా అమలు అనేది భారత ప్రజారోగ్య ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక చర్యను అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్థ నారి’ విజన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించనున్నారు. ఏటా 14 ఏళ్ల వయసు గల సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ఈ వ్యాక్సినేషన్​ టీకాలు వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్‌లో వేల రూపాయల ఖరీదు చేసే ఈ వ్యాక్సిన్​ను, ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.