సంస్కరణలపై కార్యాచరణకు అజెండా

సంస్కరణలపై కార్యాచరణకు అజెండా
చేపట్టాల్సిన సంస్కరణలపై కార్యాచరణకు అజెండా ఖరారు చేసుకోవాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇజ్రాయెల్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ శుక్రవారం మంత్రివర్గ సహచరులు అంతా ఇక చేయాల్సిన పనులపై దృష్టి సారించాలని పేర్కొంటూ మంత్రులకు మార్గదర్శనం చేశారు.  వచ్చే కొద్ది సంవత్సరాలలో మంత్రిత్వశాఖలు ముందుగా తమ ముందున్న పనులు, తమ కర్తవ్యాల గురించి సరైన రీతిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు.
సంస్కరణల అమలుపై మంత్రులంతా చొరవ తీసుకోవల్సి ఉంటుందని సూచించారు. ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్ధేశనం చేసిన విషయాన్ని అధికార వర్గాలు తర్వాత వెల్లడించాయి.  పరిపాలనా నిర్వహణలో మోదీ  ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలను తలపెట్టింది. ఇందులో భాగంగా రిఫార్మ్ అజెండాను అమలు చేయాలని నిర్ణయించింది. సాంకేతికత జోడించిన పాలన అవసరం. 
వ్యాపార సరళీకృతం, అధికారిక అనుమతుల ప్రక్రియను తేలిక చేయడం ప్రధాన అంశాలుగా రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ ప్రతిపాదించారు.  దీనిని సమర్థవంతంగా అమలు చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా మంత్రులకు అజెండాల ఖరారుకు పిలుపు నిచ్చారు. మంత్రులు సొంతంగా చేయాల్సిన పనుల గురించి నోట్ సిద్ధం చేసుకోవాలి. వీటిని అవసరం అయితే కేంద్ర కేబినెట్ సమావేశాలలో పరిశీలనకు ఉంచాలి. 
 
తమతమ శాఖలలో చేపట్టిన పనులు, రిఫార్మ్ ప్రక్రియ అమలు గురించి కేబినెట్‌కు సంక్షిప్తంగా అయినా వివరించాల్సి ఉంటుందని మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. తమ పదవీకాలంలో మంత్రిత్వశాఖల్లో సాధించిన పనుల గురించి నివేదించాల్సి ఉంటుంది. ఏ మేరకు ఫలితాలు సాధించామనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది.  2047 నాటికి భారత్‌ను వికసిత భారత్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాల్సి ఉంటుందని మంత్రులకు ప్రధాని మోదీ హితవు పలికారు.
సంస్కరణల అమలు వేగవంతం చేయడం అనేది ఈ లక్ష్య సాధనకే అని మంత్రులంతా గుర్తుంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌తో సామాన్య పౌరులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందని ఇటీవలే ప్రధాని మోదీ  వార్తా సంస్థలకు ఇంటర్వూలో తెలిపారు. లొసుగులను సవరించుకుని ముందుకు సాగితేనే వికసిత భారత్ లక్ష్యసాధనకు మార్గం సుగమం అవుతుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రుల పనితీరు ఉండాలనేదే ప్రధాని ఆలోచన. ఈ దిశలోనే ఇప్పుడు మంత్రులకు అత్యవసర రీతిలో దిశానిర్ధేశనానికి దిగినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.